చీడ పురుగు వంటి డ్రగ్స్ నివారణను సామాజిక ఉద్యమంగా మలచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. డ్రగ్స్ అంశంలో ఎవరినీ వదలొద్దని ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ‘రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ అధికారుల సదస్సు’ జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించాలన్నారు. ఇందుకు పోలీస్ అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలని, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలోనే రాష్ట్రం అనతికాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని సీఎం అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని సీఎం తెలిపారు. ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలన్నారు.

వెయ్యి మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని, అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. అదే మాదిరిగా నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా తేజోవంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు, రివార్డులు యాగ్జిలేటరీ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందనీ సీఎం స్పష్టం చేశారు.

డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

ఈ సదస్సులో పలువురు రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్, ఎక్సైజ్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు పాల్గొన్నారు.

Comments are closed.

Exit mobile version