తోటి ఉపాధ్యాయురాలిపై మరో టీచర్ అత్యచారానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం అర్బన్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం… బానోత్ కిశోర్ అనే టీచర్ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం స్కూల్ లో పనిచేస్తున్నాడు. ఓ ఉపాధ్యాయ సంఘానికి మండల అధ్యక్షునిగానూ వ్యవహరిస్తున్న కిషోర్ భార్య కూడా టీచరే. ఖమ్మం నుంచి కిషోర్ టీచర్ దంపతులు తమ తమ పాఠశాలలకు కారులో వెళ్లి వస్తుంటారు.

ఖమ్మంలోనే నివాసముంటున్న మరో లేడీ టీచర్ కూడా గార్ల మండలంలోనే పనిచేస్తుంటారు. ఈమెపై కిషోర్ కన్నేసిన నేపథ్యంలోనే ఆమె ఈనెల 17వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి వచ్చేందుకు డోర్నకల్ రైల్వే స్టేషన్ లో వేచి ఉన్నారు. తన భార్య కూడా వస్తోందని, తర్వాత స్టేజిలో కారు ఎక్కుతుందని, ముగ్గురం కారులో ఖమ్మం వెడదామని నమ్మబలికిన కిషోర్ ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. గతంలో కిషోర్ దంపతులతో ప్రయాణించిన టీచర్ అతని మాటలను విశ్వసించింది.

అయితే మార్గమధ్యంలో పాండురంగాపురంలోని ఓ ఇంట్లోకి కిషోర్ ఆమెను తీసుకువెళ్లి అత్యచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే భర్తను, పిల్లలను చంపేస్తానని కిషోర్ ఆమెను బెదిరించాడు. జరిగిన దారుణంపై గడచిన అయిదు రోజులుగా తనలో తానే మథనపడుతున్న బాధితురాలు ఎట్టకేలకు విషయాన్ని తన భర్తకు వివరించారు. ఈమేరకు భర్తతో కలిసి ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడు కిషోర్ పరారీలో ఉన్నాడని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

Comments are closed.

Exit mobile version