ఛత్తీస్ గఢ్ లో శనివారం అర్థరాత్రి దాటాక జరిగిన ఓ భారీ ఎన్కౌంటర్లో దాదాపు 13 మంది పోలీసులు గల్లంతయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ts29.inకు అందిన సమాచారం ప్రకారం సుక్మా జిల్లా కసల్పాడ్-ఎల్మాగూడ వద్ద నిన్న రాత్రి వేళ మావోయిస్టు నక్సల్స్, డిస్ట్రిక్ట్ ఆర్ముడ్ రిజర్వు (డీఆర్జీ) విభాగానికి చెందిన పోలీసుల మధ్య భీకర పోరాటం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన పరస్పర ఎదురుకాల్పుల్లో డీఆర్జీ విభాగానికి చెందిన 13 మంది పోలీసులు గల్లంతయ్యారు. ఘటన జరిగిన నిన్న రాత్రి నుంచి వారి ఆచూకీ తెలియడం లేదు. ఎన్కౌంటర్ సందర్భంగా మరో 15 మంది పోలీసులు తీవ్రంగా గాయపడగా, చికిత్స కోసం వారిని రాయపూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఎన్కౌంటర్లో కొందరు మావోయిస్టు నక్సలైట్లు కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ప్రహార్ కార్యక్రమంలో భాగంగా డీఆర్జీ, ఎస్టీఎఫ్ విభాగాలకు చెందిన సుమారు 550 మంది పోలీసులు నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టిన సందర్భంగా ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Comments are closed.

Exit mobile version