రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న పట్టణాన్ని పెద్ద నగరంగా చేయడానికి, సౌకర్యాలను మెరుగుపర్చేందుకు తాము తాపత్రయపడుతున్నామన్నారు. అయితే ఇది కొంత మందికి నచ్చడం లేదని, తాము చేస్తున్న పని విధానాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. కానీ కొన్ని పార్టీలు.., ఈ మధ్య కొంత మంది బుడ్డర్ ఖాన్ లు తయారయ్యారన్నారు. ఖమ్మంలో ఏ ఇష్యూ లేకపోయినా, నలుగురైదుగురిని రెచ్చగొట్టి ఈ బుడ్డర్ ఖాన్ లు కృత్రిమ ఉద్యమాలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అజయ్ మండిపడ్డారు. ఆ పార్టీలకుగాని, నాయకులకుగాని ఇక్కడ పుట్టగతులు లేవ్.., ఉండవ్ కూడా.., డెఫినెట్ గా… అని మంత్రి అన్నారు. గతం కూడా, చరిత్ర కూడా అదే చెబుతోందన్నారు.
ఖమ్మంలో రూ. 17.50 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న మోడరన్ బస్ స్టేషన్ నిర్మాణ పనులను మంత్రి అజయ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. పనుల వేగం పెంచాలని అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. డిసెంబర్ నాటికి బస్ స్టేషన్ ప్రారంభించి ఇక్కడి నుండే ప్రజలకు రవాణా సేవలు అందించనున్నామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అజయ్ కుమార్ ఖమ్మంలో తాజాగా జరుగుతున్న ఆందోళనలను, ఉద్యమాలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలోని తాజా పరిణామాలపై మంత్రి అజయ్ ఇంకా ఏమంటున్నారో దిగువన గల వీడియోలో చూడవచ్చు.