మావోయిస్టు అగ్రనేతల కొరియర్ గా పోలీసులు ప్రకటించిన ఈశ్వర్ హత్యోదంతంపై ఆ పార్టీ స్పందించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీపాన ఈశ్వర్ అనే వ్యక్తిని నక్సలైట్లు రెండు రోజుల క్రితం హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈశ్వర్ మావోయిస్టు పార్టీ అగ్రనేతలైన హరిభూషణ్, దామోదర్, చంద్రన్నలకు కొరియర్ గా వ్యవహరించేవాడని, పోలీస్ ఇన్ఫార్మర్ ముద్ర వేసి అతన్ని నక్సలైట్ల హత్య చేశారని పోలీసు శాఖ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-తూర్పుగోదావరి జిల్లాల డివిజనల్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదలైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎస్ఐబీ పోలీసు అధికారులు ఈశ్వర్ ను పోలీస్ ఇన్ఫార్మర్ గా మార్చుకున్నారని ఆజాద్ ఆరోపించారు. అతనికి హోంగార్డు ఉద్యోగం ఇచ్చి తమ నాయకత్వాన్ని, దళాలను నిర్మూలించేందుకు పథకం వేశారన్నారు.
![ts29 azad](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/10/azad.jpg?resize=788%2C364&ssl=1)
పథకంలో భాగంగానే తమ సభ్యుడైన ఐతులును నమ్మించి పోలీసులు గత నెల 7వ తేదీన బూటకపు ఎన్కౌంటర్ లో హత్య చేశారని ఆజాద్ ఆరోపించారు. అందుకే ఈశ్వర్ కు ప్రజాకోర్టులో… ప్రజలు మరణ శిక్ష విధించారన్నారు. దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎస్ఐబీ పోలీసు అధికారులే బాధ్యులన్నారు. ఎవరూ ఈశ్వర్ లాగా నమ్మకద్రోహం చేయవద్దని, అలా చేస్తే శిక్ష తప్పదని మావోయిస్టు నేత ఆజాద్ తన ప్రకటనలో పేర్కొన్నారు.