రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. ఏదేని ఎన్నికల సందర్భంగా వీటి తీవ్రత మరింతగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల మధ్య జరిగే యుద్ధవాతావరణాన్ని మీడియా సంస్థలు భుజాన వేసుకోవడమే అసలు చర్చనీయాంశం.
తెలుగు మీడియా ఎన్నెన్ని రంగులు పులుముకున్న సంగతి తెలిసిందే కదా? దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు ‘ఆ రెండు పత్రికలు’ అని మాత్రమే విమర్శించేవారు. ఆయన మరణానంతరం ‘ఆ రెండు పత్రికల’తోపాటు మరికొన్ని మీడియా సంస్థలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘ఎల్లో మీడియా’గా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. ఈ జాబితాలో ఏయే మీడియా సంస్థలున్నాయనేది కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.
అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి వంత పాడుతున్న మీడియా సంస్థలపై ‘పింక్’ మీడియాగా ప్రచారం ఉండనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా నిలుస్తున్న మీడియా సంస్థలకూ ‘బ్లూ మీడియా’గా పేరుంది. ఇందుకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీలు ఎన్నో సందర్భాల్లో పరస్పర విమర్శలు చేశాయి.., ఇంకా చేసుకుంటున్నాయి కూడా.
![ts29 v6](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/10/v6.jpg?resize=579%2C328&ssl=1)
దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా నిన్నటి పరిణామాలపై మీడియాలో భిన్న కథనాలు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల నివాసాల్లో పోలీసుల తనిఖీలు, అనంతర పరిణామాలకు సంబంధించి భిన్న కోణాల్లో వార్తలు ప్రసారమయ్యాయి, ప్రచురితమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పెద్దపల్లి మాజీ ఎంపీ, ప్రస్తుతం బీజేపీలో గల గడ్డం వివేక్ కు చెందిన మీడియా సంస్థపై టీఆర్ఎస్ కరదీపిక ‘నమస్తే తెలంగాణా’ నేరుగానే విరుచుపడింది. వివేక్ కు చెందిన వీ6 ఛానల్ ను ‘ఛీ6’గా శీర్షీకరించి ఆ పత్రిక ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.
వీ6 ఛానల్ పేరు మార్చి నమస్తే తెలంగాణా సెటైర్ కథనాన్ని ప్రచురించిన పరిణామాల్లోనే బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు మీడియా సంస్థల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం గమనార్హం. సీఎం మోచేతి నీళ్లు తాగే కొన్ని పత్రికలు, ఛానళ్లు తమ సహనాన్ని పిరికితనంగా చూస్తున్నాయని ఆయన విమర్శించారు.