ఔను… నిర్ధాక్షిణ్యంగా పెట్రోల్ పోసి కాల్చిన బాలిక కన్ను మూసింది. అనువణువునా దహించిన అగ్ని కీలలు చేసిన ఆర్తనాదపు బాధలతో ఇక పోరాడలేనని ఆమె సెలవు తీసుకుంది. కామాంధులు సంచరిస్తున్న ఈ లోకాన్ని, ప్రవృత్తిని కులవృత్తిగా మార్చి నిందితులకు బాసటగా నిలుస్తున్న కొందరి పోకడను తాను భరించలేని మైనర్ బాలిక తనువు చాలించింది. పదమూడేళ్ల మోతె నర్సమ్మ ప్రాణం కోల్పోయింది. అత్యంత అమానవీయ ఈ ఘటనలో ప్రాణంతో ఉన్నపుడే ఆయా బాలిక గాయాలపై పేలాలు ఏరుకునే ప్రక్రియకు కొందరు శ్రీకారం చుట్టడం దారుణ పరిణామం.
ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామానికి చెందిన మోతె నర్సమ్మ (13) తన కుటుంబానికి ఆర్థికంగా చేదోడు, వాదోడుగా ఉండేందుకు ఖమ్మంలోని పార్శీబంధంలో నివసించే అల్లం సుబ్బారావు ఇంట్లో పని మనిషిగా చేరింది. మైనారిటీ కూడా తీరని ఈ బాలికపై ఇంటి యజమాని కుమారుని కన్ను పడింది. గత నెల 19వ తేదీన ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆయా మైనర్ బాలిక ఒంటరిగా ఉండగా, సుబ్బారావు కుమారుడు అల్లం మారయ్య (25) ఆమెను బలాత్కరించే ప్రయత్నం చేయగా, అందుకు ఆమె నిరాకరించింది.
దీంతో మైనర్ బాలికను చంపాలనే ఉద్ధేశంతో ఆమెపై పెట్రోల్ పోసి మారయ్య నిప్పంటించాడు. ఈ ఘటనపై బాధిత బాలిక తండ్రి ఉప్పలయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, మారయ్యపై పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేశారు. నిందితుడైన మారయ్యను ఈనెల 6వ తేదీన అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
ఇదీ చదవండి:
అత్యంత ఈ దారుణ ఘటనను కొందరు తప్పుదోవ పట్టించేందుకు ఈ సందర్భంగా విఫలయత్నం చేశారు. బాధిత కుటుంబపు ఆవేదనకన్నా, నిందితుడైన మారయ్య కుటుంబ వాదననే బలీయంగా తెరపైకి తీసుకువచ్చేందుకు యత్నించారు. మొత్తం ఘటనను మసిపూసి, మారేడుకాయ చేసేందుకు విఫల ప్రయత్నం చేశారు. జిల్లాలోని రాజకీయ పక్షాలు, వాటి అనుబంధ సంస్థలు, మహిళా సంఘాలు బాలికకు న్యాయం చేయాలని నినదిస్తూ ఆందోళనకు దిగాయి. కానీ ‘అమ్మాయి అబద్ధాలాడుతుందా? మోసం చేసిందా? కట్టుకథలు చెబుతున్నదా?’ అంటూ కొందరు వివిధ ప్రసార మాధ్యమాల్లో అంతర్లీనంగా బాలికపై వ్యతిరేక ప్రచారానికి తెగించారు. ఈ వైనంపై ప్రజల్లో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. దుష్ప్రచారానికి దిగిన వ్యక్తుల తీరుతెన్నులపై పలువురు మండిపడ్డారు కూడా.
కానీ పోలీసుల విచారణ ముందు ఇటువంటి కుటిలయత్నాలేవీ ఫలించలేదు. బాలికను చంపాలనే ఉద్దేశంతోనే అల్లం మారయ్య ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించాడని పోలీసు శాఖ అధికారికంగానే ప్రకటించింది. దీంతో బాలికకు జరిగిన ఘటనను సైతం సొమ్ము చేసుకోవాలనే కొందరి పన్నాగం బట్టబయలైంది. అనంతర పరిణామాల్లో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి బాలికను తరలించారు. బాధిత బాలిక తల్లిదండ్రుల కోరిక మేరకు మంత్రి సత్యవతి రాథోడ్ కూడా చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగానే మరింత మెరుగైన చికిత్స అందించేందుకు బాధిత బాలిక నర్సమ్మను రెయిన్ బో ఆసుపత్రికి తరలించారు.
కానీ అమానుషపు తీవ్రత ముందు ఏ ప్రయత్నమూ ఆ బాలికను కాపాడలేకపోయింది. మానవ మృగం దాష్టీకానికి మైనర్ బాలిక బలైపోయింది. చికిత్స తీసుకుంటూనే గురువారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచింది. దాదాపు డెబ్బయి శాతం కాలిన గాయాలతో హృదయ విదారక స్థితిలో గల బాలికపై దుష్ప్రచారానికి దిగిన వారి కళ్లు బహుషా ఇప్పుడు మరింత చల్లబడి ఉంటాయి. కామాంధుని చేష్టలను సమర్థిస్తూ ప్రచారానికి దిగిన వారు ప్రస్తుతం ఆ బాలిక శవంపైనా పేలాలు ఏరుకుంటారేమో… చూడాలి మరి!