ఖమ్మం జిల్లాకు చెందిన మైనర్ బాలిక నర్సమ్మ మృతిపట్ల రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అత్యాచార యత్నంలో ప్రతిఘటించినందుకు దుండగుని పెట్రోల్ దాడిలో 70 శాతానికి పైగా కాలిపోయి హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్, రెయిన్ బో హాస్పిటల్ లో గత పది రోజులుగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి బాలిక నర్మమ్మ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ, నర్సమ్మ మరణానికి కారకులైనవారికి కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. కూతురు మరణంతో తీవ్ర శోకసంద్రంలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
తమ బిడ్డను కచ్చితంగా కాపాడాలని, సత్వర చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించాలని నర్మమ్మ తల్లిదండ్రులు వెంకటమ్మ, ఉప్పలయ్యల విజ్ణప్తి మేరకు మంత్రి సత్యవతి రాథోడ్ బాలికను రెయిన్ బో హాస్పిటల్ కు తరలించి వైద్యం అందించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీమతి దివ్యను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ శ్రీమతి దివ్య స్వయంగా వెళ్లి బాలికను ఉస్మానియా హాస్పిటల్ నుంచి రెయిన్ బో హాస్పిటల్ కు తరలించి గత వారం రోజులుగా వైద్యం అందిస్తున్నారు.
దురదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడిన బాలికకు వైద్యం అందించినప్పటికీ నిన్న రాత్రి మరణించడం అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. బాలిక కుటుంబానికి కావలసిన సాయాన్ని ప్రభుత్వం అందించేలా చర్యలు తీసుకోవాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ను ఆదేశించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు