ఖమ్మం నగరంలో అమానుషానికి గురైన పదమూడేళ్ల బాలిక మోతె నర్సమ్మ కొద్ది సేపటి క్రితం మరణించింది. ఈ మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడి, పెట్రోల్ పోసి దహనం చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
పోలీసుల కథనం ప్రకారం… ఖమ్మంలోని పార్శీబంధంలో నివసించే అల్లం సుబ్బారావు ఇంట్లో 13 ఏళ్ల మోతె నర్సమ్మ అనే బాలిక పనిచేస్తోంది. గత నెల 19వ తేదీన ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆయా మైనర్ బాలిక ఒంటరిగా ఉండగా, సుబ్బారావు కుమారుడు అల్లం మారయ్య (25) ఆమెను బలాత్కరించే ప్రయత్నం చేయగా, అందుకు ఆమె నిరాకరించింది.
దీంతో మైనర్ బాలికను చంపాలనే ఉద్ధేశంతో ఆమెపై పెట్రోల్ పోసి మారయ్య నిప్పంటించాడు. ఈ ఘటనపై బాధిత బాలిక తండ్రి ఉప్పలయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, మారయ్యపై కేసు నమోదు చేశారు. నిందితుడైన మారయ్యను ఈనెల 6వ తేదీన అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
తీవ్రంగా గాయపడిన నర్సమ్మకు తొలుత ఖమ్మం నగరంలోని పూజ ఆస్పత్రిలో రహస్యంగా చికిత్స చేయించారు. అయితే ఈ ఘటన వెలుగు చూసిన తదనంతర పరిణామాల్లో ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. గత వారం రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న నర్సమ్మ ఆరోగ్యం విషమించి కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచింది.