శీర్షికే ఎబ్బెట్టుగా, అసహ్యంగా ఉంది కదా? ఆ మధ్య అదేదో టీవీ కూడా ఇదే తరహా భాషతో హెడ్డింగ్ పెట్టి అభాసు పాలైంది. సరే ఆ టీవీ, దాని రిపోర్టర్ స్థాయి అదే కావచ్చు, ఆయా అంశాలను కాసేపు వదిలేసి దిగువన గల ఈ వార్తా కథనాన్ని ఓసారి చదవండి. అసలు విషయం ఆ తర్వాత చెప్పుకుందాం.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సబ్బం హరి.. నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపం… విశ్వాస ఘాతుకానికి అసలు సిసలు ప్రతిరూపం… ఇదేంటి అన్నేసి మాటలు. అని అనుకుంటున్నారా… అయితే సబ్బం హరి చిట్టా విప్పాల్సిందే..
►విశాఖ నగరంలో పనీ పాటా లేకుండా చిల్లర వేషాలు, రౌడీవ్యవహారాలు, సెటిల్మెంట్లు చేస్తూ కాలం గడిపేసిన సబ్బం హరిని అదృష్టం వరించి 1995లో అనూహ్యంగా విశాఖ నగరపాలకసంస్థ మేయర్ అయ్యారు. గౌరవప్రదమైన మేయర్ పదవిలో ఉండి…ఓ సారి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన ఉదంతంలో అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఆనాటి పోలీస్కమిషనర్ ఆర్íపీ మీనా, డీఎస్పీ రామచంద్రరాజులు బూటుకాళ్లతో బుద్ధి చెప్పారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన మేయర్గా ఉంటూనే.. ఏకంగా సీతమ్మధారలో ప్రభుత్వ పార్కు స్థలాన్ని కబ్జా చేసేశారు. ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాన్నే జీవీఎంసీ అధికారులు కూలగొట్టారు.
►ఒక్క దఫా మేయర్గా పని చేసి… చెరిగిపోని మరకలు అంటించుకున్న సబ్బం హరిని కాంగ్రెస్ పార్టీనే కాదు.. నగర ప్రజలు కూడా దూరంగా పెట్టేశారు. అందుకే 1999 ఎన్నికల్లో విశాఖ–1 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దారుణ పరాభవం రుచిచూపించారు. అటు తర్వాత మారిన మనిషినని నమ్మించి మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డాడు. ఓ దఫా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణతో అప్పటి విశాఖ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి సదరు సబ్బం హరిని సస్పెండ్ కూడా చేయించారు. అప్పుడు కూడా వైఎస్ పెద్దమనసుతో మన్నించి నేదురుమల్లిని ఒప్పించి తిరిగి హరిని పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గరుండి అనకాపల్లి లోక్సభ సీటు ఇప్పించి గెలిపించారు. మహానేత హఠాన్మరణం తర్వాత సబ్బం హరి ఎలాంటి ‘కృతజ్ఞత’ చూపించారో అందరికీ తెలుసు.
2014 ఎన్నికల్లో సమైక్యాంధ్ర చివరి సీఎం కిరణ్కుమార్రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి.. ఆనక చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి హరిబాబుకు ఓటేయాలని పిలుపునిచ్చాడు. ఆ ఎన్నికల తర్వాత ఐదేళ్లు 2014 నుంచి 2019 వరకు బయటకు మొహం చూపించలేని దుస్థితి దాపురించింది. 2019లో సరిగ్గా ఎన్నికల సమయంలో తెర మీదకు వచ్చి తెలుగుదేశం పారీ్టలో ఎవ్వరూ వద్దన్న భీమిలి బరిలో నిలుచుని వైఎస్సార్సీపీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై భారీ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. సబ్బం రుద్దుడు భరించలేక భీమిలి ప్రజలు తిప్పికొట్టడంతో ఎన్నికల తర్వాత బయటకు మొహం చూపించలేక టీవీలకే పరిమితమయ్యాడు. కేవలం టీవీల్లో తప్పించి బయట ఎక్కడా కానరాని సబ్బం హరి విన్యాసాలు చూస్తే.. జబర్దస్త్ కామెడీకి మించి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అయితే శనివారం ఆ కామెడీ శృతి మించి సీరియస్ కావడంతో సబ్బం హరిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన హరిపై అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునేందుకు వెనుకాడబోమని జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
‘సాక్షి’ విశాఖపట్నం జిల్లా ఎడిషన్ లో బ్యానర్ స్టోరీగా, అదే సంస్థ వెబ్ సైట్ తో ఇదే కథనాన్ని ఈరోజు వాడారు. ఓకే… తన ఇంటి బాత్రూమ్, ప్రహారీలను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారనే కోపంతో నిన్న సబ్బం హరి కూడా ఇదే తరహా భాషను వినియోగిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాజీ ఎంపీ సబ్బం హరి వాడిన భాష కూడా ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు.
కానీ సబ్బం హరి స్థాయికి దిగజారుతూ ‘సాక్షి’ తన వార్తా కథనంలో భాషను వినియోగించడమే గమనించాల్సిన అంశం. రాసిందెవరో సాధారణ కంట్రిబ్యూటర్ కూడా కాదు. డేట్ లైన్ చూస్తే బ్యూరో ఇంచార్జ్ రాసినట్లే స్పష్టమవుతోంది. ‘చిల్లర వేషాలు, రౌడీ వ్యవహారాలు, ఫలానా పోలీసు అధికారులు బూటు కాళ్లతో బుద్ధి చెప్పారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మొహం చూపించలేని దుస్థితి దాపురించింది. సబ్బం ‘రుద్దుడు’ భరించలేక భీమిలి ప్రజలు తిప్పికొట్టడంతో… జబర్ధస్త్ కామెడీకి మించి సబ్బం హరి విన్యాసాలు… తదితర పదాలతో ఎడిటోరియల్ లాంటి వార్తా కథనాన్ని సాగదీస్తూ రాసేశారు. ఇంతకీ ఇది ఎడిటోరియలో, వార్తా కథనమో అనేది కూడా సందేహాస్పదమే. ఎందుకంటే అందులో వాడిన భాష విజయవాడ కేంద్రంగా వెలువడి, సంచలన పత్రికగా ప్రాచుర్యం పొందిన ఓ పత్రిక తరహాలో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.
అంతే కాదు, సబ్బం హరిని తిట్టబోయి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను డామేజ్ చేసినట్లు కూడా వార్తా కథనంలో కనిపిస్తోంది. పెద్దమనసుతో వైఎస్ సబ్బం హరిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారని, 2009 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ఇప్పించి, దగ్గరుండి మరీ గెలిపించారని పేర్కొన్నారు. అంటే రౌడీ వ్యవహారాలు, చిల్లర వేషాలు (సాక్షి పదాలు మాత్రమే సుమీ) అంటూ సబ్బం హరి తీరును ఏకరవు పెట్టడానికి చేసిన అక్షర ప్రయత్నం కాస్తా అభాసుపాలైనట్లు కనిపిస్తోంది. అటువంటి ‘వేషాలు’ వేసే వ్యక్తిని వైఎస్ ఎందుకు చేరదీశారనే సందేహాన్ని కూడా సాక్షి తన పాఠకుల్లో కలిగించినట్లుగా ఉండడం గమనార్హం.
‘అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన మేయర్గా ఉంటూనే.. ఏకంగా సీతమ్మధారలో ప్రభుత్వ పార్కు స్థలాన్ని కబ్జా చేసేశారు. ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాన్నే జీవీఎంసీ అధికారులు కూలగొట్టారు.’ అని వార్తా కథనంలో పేర్కొన్నారు. కానీ ఆయన ఎంత స్థలాన్ని ఆక్రమించారు? దాని విలువ ఎంత? సర్వే నెంబర్ ఎంత? జీవీఎంసీ అధికారులు ఇందుకు సంబధించి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారు? అందుకు సబ్బం హరి ఇచ్చిన సమాధానమేంటి? వంటి అంశాలను గణాంకాలతో, ఆధారాలతో సహా వివరిస్తే బాగుండేది. ‘సాక్షి’ కథనపు భాషా ప్రకారమే సబ్బం హరి చిల్లరవేషాలు, రౌడీ వేషాలకు సంబంధించి నమోదైన కేసుల వివరాలు, పోలీసు అధికారుల వివరణలు కూడా ప్రచురిస్తే కథనం సమగ్రంగా ఉండేది. ఇవేవీ లేకుండా ‘చిల్లర’ పదాలను వాడుతూ ఇంట్లో కూర్చుని వండినట్లు కనిపిస్తున్న ఈ ‘భాషా లెస్’ వార్తా కథనం సాక్షి పెద్దలకు రుచిస్తుందో, లేదో తెలియదు గాని, పాఠకులు మాత్రం ఈ తరహా భాషను అహ్వానించరనేది నిర్వివాదం. ఎందుకంటే ఇది ‘సాక్షి’ స్కూల్ ఆప్ జర్నలిజం భాష కాకపోవచ్చు కూడా. ఇటువంటి భాషను వెనకటి కాలంలో ‘ఎల్లో జర్నలిజం’గా అభివర్ణించేవారు.
మా ఇష్టం మేం ఇలాంటి భాషనే వాడుతాం… మా పత్రిక మా ఇష్టం, మీకేంటి అభ్యంతరం అంటే మాత్రం… ఇదిగో ఈ దిగువన గల వీడియో లింకులో సబ్బం హరి వాడిన భాషకు, సాక్షి ‘బాస’కు పెద్ద తేడా ఉన్నట్లు కనిపించకపోవచ్చు. అదీ అసలు సంగతి.