ది.03.10.2020
పోలీసు కమిషనర్ కార్యాలయం ఖమ్మం …
పరిపాలన ఆంశలో భాగంగా
(అడ్మిస్ట్రేషన్ గ్రౌండ్)
ఖమ్మం రూరల్ ఎస్సై రామును ఖమ్మం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్మెంట్ చేస్తు పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఉత్తర్వులు జారీ చేశారు .
పి ఆర్ వో
చదివారుగా…? ఈ పత్రికా ప్రకటన ప్రకారం పరిపాలనా అంశంలో మాత్రమే రాము అనే ఎస్ఐని ఆర్ముడ్ రిజర్వు విభాగానికి అటాచ్ చేస్తూ ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఉత్తర్వు జారీ చేశారు. కానీ ఈ చర్య ఖమ్మం జిల్లా పోలీసు శాఖలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. చర్చనీయాంశంగానూ మారింది. అసలు విషయాన్ని మరుగునపర్చి కొందరు వ్యక్తులు ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ను తప్పుదోవ పట్టించారనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంలో బియ్యం అక్రమ రవాణా మాఫియాతో సంబంధం ఉన్నట్లు ప్రచారంలో గల ఒకరిద్దరు జర్నలిస్టుల ప్రమేయంపైనా భిన్న వాదన వినిపిస్తోంది.
ఎస్ఐ రాము వీఆర్ అటాచ్మెంటుకు దారి దీసినట్లు భావిస్తున్న ఘటన పూర్వాపరాల్లోకి వెడితే…. గత నెల 10వ తేదీ ప్రాంతంలో అక్రమంగా రవాణా అవుతున్న బియ్యం లోడ్ లారీని ఖమ్మం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. పౌరసరఫరాల విభాగానికి చెందిన డిప్యూటీ తహశీల్దార్, పోలీసు శాఖకు చెందిన రూరల్ ఏసీపీ సమక్షంలోనే ఈ లారీని పోలీసులు పట్టుకోవడం గమనార్హం. ప్రక్రియలో భాగంగా పంచనామా నిర్వహించిన అనంతరం సివిల్ సప్లయిస్ విభాగానికి చెందిన అధికారుల దరఖాస్తు ప్రకారం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో నర్రా పెద్దులు అనే వ్యక్తి కూడా నిందితుల్లో ఒకడిగా ఉన్నాడు. పిటిషన్ లోనూ నర్రా పెద్దులు పేరే రాసి ఉండడం గమనించాల్సిన అంశం. పోలీసులు కూడా నర్రా పెద్దులు అనే వ్యక్తికే సీఆర్పీసీ 41 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ఎఫ్ఐఆర్ కాపీలో మాత్రం నిందితుల్లో ఒకడైన నర్రా పెద్దులు అనే వ్యక్తి పేరుకు బదులు నర్రా సైదులు అనే పేరు పొరపాటున వచ్చిందట. ఏ రకంగా చూసినా ఇది కంప్యూటర్ ఆపరేటర్ మిస్టేక్ మాత్రమేనంటున్నారు. వాస్తవికంగా నర్రా పెద్దులుపైనే చట్ట ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నర్రా సైదులు అనే వ్యక్తి భౌతికంగా లేడని, అతను చనిపోయాడని అంటున్నారు.
ఆయా పరిణామాల్లోనే ఎస్ఐ రామును ఏఆర్ విభాగానికి అటాచ్ చేశారని అంటున్నారు. సాంకేతికంగా మాత్రం పరిపాలనాపరంగా మాత్రమే అటాచ్మెంట్ ఇచ్చినట్లు ప్రకటనలో పేర్కొనడం విశేషం. కానీ బియ్యం అక్రమ రవాణా ఉదంతంలో ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఒకరిద్దరు విలేకరులకు ఉన్నట్లు భావిస్తున్న ప్రమేయంపైనా భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పట్టుబడిన లారీని , నిందితులను ఈ కేసు నుంచి తప్పించేందుకు ఒకరిద్దరు జర్నలిస్టులు తీవ్రంగా ప్రయత్నించారని, అందుకు ఎస్ఐ రాము సహకరించలేదనేది ప్రచారంలో గల కథనపు సారాంశం. బియ్యం అక్రమ రవాణా మాఫియాతో ఆయా విలేకరులకు గల సన్నిహిత సంబంధాలే ఇందుకు కారణమనే ప్రచారం సాగుతోంది.
మొత్తంగా ఈ ఘటనలో పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ను కొందరు తప్పుదోవ పట్టించారనే వ్యాఖ్యలు పోలీసు వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ చేసిన మిస్టేక్ కు ఎస్ఐపై చర్య తీసుకున్న పరిణామం చిత్తశుద్ధితో విధులు నిర్వహించేవారి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తాయనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. అసలు బియ్యం అక్రమ రవాణా అంశంలో కొందరు విలేకరుల ప్రమేయం, అనంతర పరిణామాల్లో వారి అత్యుత్సాహంపైనా విచారణ జరపాలనే వాదన కూడా వినిపిస్తోంది.