విజయవాడకు చెందిన పురాణం శివకుమారి అనే మహిళ తన ముగ్గురు కుమారులతో కలిసి ఒక్క ఖమ్మం జిల్లాలోనే రూ. 3.54 కోట్ల మేరకు మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏడు ఘటనల్లో ఛీటింగ్ కేసులు నమోదైనట్లు ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి వివరించారు.
ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ సత్యానారాయణరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం… విజయవాడ భవానీనగర్ కు చెందిన పురాణం శివకుమారి అనే మహిళ తన ముగ్గురు కుమారులతో కలసి ఈ మోసాలకు పాల్పడింది. భారీ ఎత్తున నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నట్లు వ్యాపారులను, రైతులను ముందుగా డబ్బులు చెల్లించి నమ్మించింది. ఆ తరువాత రూ. లక్షల్లో అప్పు చేసి, డబ్బులు కాజేసి, బాధితులకు కుచ్చు టోపి పెట్టింది.
తాము మోసపోయామని గుర్తించిన బాధితులు అమెను నిలదీయగా, డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో విసుగు చెందిన ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం రాఘవేంద్రనగర్ కు చెందిన మాలోతు సునీత పోలీసులను ఆశ్రయించారు. తాను శివకుమారికి రూ. 70 లక్షల మొత్తాన్ని ఇచ్చి మోసపోయినట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ఖమ్మం రూరల్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో మొత్తం నలుగురు నిందితుల్లో పురాణం శివ, పురాణం శంకర్ లను అరెస్టు చేసినట్లు ఖమ్మం రూరల్ సిఐ సత్యనారాయణ రెడ్డి వివరించారు.
ప్రధాన నిందితురాలు పురాణం శివకుమారి, నాలుగో నిందితుడు పురాణం గోపికృష్ణ పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితులపై మొత్తం మూడు కోట్ల, యాభై నాలుగు లక్షల మోసపు ఘటనలకు సంబంధించి ఖమ్మం వన్ టౌన్, త్రీ టౌన్, కూసుమంచి, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఏడు ఛీటింగ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. పరారీలో గల మిగతా ఇద్దరు నిందితులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు. అదేవిధంగా ప్రజలు ఇలాంటి వారి మాటలు నమ్మి మోస పోవద్దని, అప్రమత్తంగా వుండాలని సీఐ సత్యనారాయణరెడ్డి సూచించారు.
ఫొటో: పురాణం శివకుమారి మోసపు దందా వివరాలను వెల్లడిస్తున్న ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి