భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో గురువారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకుంది. గుండాల మండలం దేవళ్లగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు, పోలీసులకు మధ్య ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ లో ఓ నక్సల్ మరణించినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. ఘటనా స్థలం నుంచి తమ బలగాలు ఇంకా వెనక్కి రాలేదని, పూర్తి వివరాలు అందాల్సి ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఎన్కౌంటర్ ఘటనపై భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ వివరిస్తూ, గత రెండు మూడు రోజులుగా గుండాల మండలం దేవలగూడెం, దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళం, యాక్షన్ టీంలు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం వచ్చిందన్నారు. దీంతో ఈ రెండు గ్రామాల సరిహద్దుల్లో ప్రతిరోజు గుండాల పోలీసులు, స్పెషల్ పార్టీల ఆధ్వర్యంలో ఏరియా డామినేషన్, వాహన తనిఖీలు చేపట్టామన్నారు. నిన్న రాత్రి తమకు అందిన నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 4.15 గంటల సమయంలో గుండాల సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుంటే బైకుపై ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి, లొంగిపొమ్మని గట్టిగా కేకలు వేస్తుంటే అకస్మాత్తుగా వారు పోలీసులపై కాల్పులు జరిపారని చెప్పారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిపై తిరిగి కాల్పులు జరిపారని, కొద్ది సమయం తర్వాత కాల్పులు జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సుమారుగా 25 సంవత్సరాలు కలిగిన ఒక గుర్తు తెలియని మావోయిస్టు మృతదేహం, ఒక ఆయుధం, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు.
ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలి దృశ్యాలను దిగువన చూడవచ్చు.