తెలంగాణా రాష్ట్ర పోలీసు శాఖ బాస్ ఎం. మహేందర్ రెడ్డి రెండో రోజు కూడా ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో మకాం వేయండంపై చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు రాష్ట్ర డీజీపీ స్వయంగా అటవీ ప్రాంతాల మీదుగా ఏరియల్ సర్వే నిర్వహిస్తుండడం గడచిన నెలన్నర వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. గత జూలై 17వ తేదీన గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మావోయస్టు నక్సల్స్ కార్యకలాపాలపై అప్రమత్తతను బోధించారు.
ఈ పర్యటన ముగిసిన 45 రోజుల వ్యవధిలోనే డీజీపీ మహేందర్ రెడ్డి రెండోసారి ఏజెన్సీ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడం, కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి నక్సల్ కార్యకలాపాల తీరుతెన్నులపై సమీక్షించడం సహజంగానే చర్చకు దారి తీసింది. తెలంగాణాలో మావోయిస్టు నక్సల్స్ కార్యకలాపాలు మళ్లీ వేళ్లూనుకుంటున్నాయని, ఆ పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి సహా మరికొందరు ముఖ్య నేతలు లొంగిపోతారనే వార్తల నేపథ్యంలో డీజీపీ ఏజెన్సీ పర్యటన ఉత్కంఠకు హేతువైనట్లు భావిస్తున్నారు.
బుధవారం ప్రత్యేక హెలీకాప్టర్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో డీజీపీ పర్యటించారు. తొలుత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకున్న డీజీపీ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఇంచార్జ్ ఎస్పీ, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో సమావేశమయ్యారు. అనంతరం ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్ తో కలిసి మహారాష్ట్ర, తెలంగాణా సరిహద్దుల్లోని ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేశారు. ఆ తర్వాత జిల్లా పోలీసు యంత్రాంగంతో సమావేశం నిర్వహించి మావోయిస్టుల కట్టడికి సూచనలు చేశారు. అయితే ఆసిఫాబాద్ లోనే గురువారం కూడా డీజీపీ మకాం వేయడం విశేషం.
ఈ నేపథ్యంలో డీజీపీ స్థాయి పోలీస్ ఉన్నతాధికారి రెండో రోజు కూడా ఒకే ప్రాంతంలో మకాం వేయడం భిన్నరకాల చర్చకు తావు కల్పిస్తోంది. డీజీపీ ఏ అటవీ ప్రాంత పర్యటనకు వెళ్లినా గ్రే హౌండ్స్, ఇంటలిజెన్స్, ఎస్ఐబీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకోవడం విధినిర్వహణలో భాగంగా చెబుతుంటారు. గడచిన దశాబ్ధ కాలంలో తెలంగాణాలో మావోయిస్టు నక్సల్ కార్యకలాపాలు లేవని భావిస్తున్న తరుణంలో, తీవ్రవాద కార్యకలాపాల ఉనికిని చాటుతూ అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
![ts29 dgp asifa compressed](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/09/dgp-asifa-compressed.jpg?resize=788%2C443&ssl=1)
ముఖ్యంగా గడచిన అయిదారు నెలలుగా మవోయిస్టు కార్యకలాపాలు తెలంగాణాలోని పలు జిల్లాల్లో మళ్లీ వేళ్లూనుకున్నట్లు పలు సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. గురువారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దుబ్బగూడెం-దేవళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో గుర్తు తెలియని మావోయిస్టు నక్సల్ ఒకరు మృతి చెందడం ఓ ఉదాహరణ మాత్రమే. గత జూలై రెండో వారంలో అటు ఆసిఫాబాద్, ఇటు కొత్తగూడెం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్ ఘటనలు కూడా తెలంగాణాలో మావోయిస్టుల ఉనికిని చాటాయి.
మరోవైపు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆడెల్లు అలియాస్ భాస్కర్ నాయకత్వంలో యాక్షన్ టీం సంచరిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు మావోయిస్టు పార్టీకి చెందిన యాక్షన్ టీం సంచరిస్తోందనే సమాచారం మేరకు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలోనే గుండాల మండలంలో ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుని నక్సల్ ఒకరు మరణించినట్లు కొత్తగూడెం ఎస్పీ ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అటు ఆసిఫాబాద్ నుంచి ఇటు కొత్తగూడెం వరకు మావోయిస్టు పార్టీ యాక్షన్ టీంలు సంచరిస్తున్నట్లు పోలీసులు పసిగట్టారు.
అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో గల గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలను అనుకుని ఉన్న ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో మళ్లీ పాగా కోసం మావోయిస్టు నక్సల్స్ గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం సరిహద్దుల్లోనే కాదు, ఆయా ప్రాంతాలను దాటుకుని తిర్యాని వంటి రోడ్ సైడ్ ప్రాంతాలకు కూడా నక్సల్ కదలికలు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆడెల్లు అలియాస్ భాస్కర్ దళం నక్సల్స్ కదలికలను ఇందుకు ఉదహరిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో పరిస్థితి చేయిదాటకముందే నక్సల్ కట్టడికి గట్టి చర్యలు తీసుకోవడంలో దిశా, నిర్దేశం చేసేందుకే రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా రెండోసారి రంగంలోకి దిగారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టులకు స్థానిక గిరిజనులు సహకరించేందుకు గల పరిస్థితులను కూడా అధ్యయనం చేస్తున్నారని, అటువంటి అంశాలను లోతుగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునేందుకే డీజీపీ సంబంధిత జిల్లాల కలెక్టర్లతోనూ సమావేశమవుతున్నారని అంటున్నారు. ఈ అంశంలో ప్రభుత్వం వద్ద నిర్దిష్ట ప్రణాళిక ఉందని, అంతిమంగా మావోయిస్టులను ఆదిలోనే అడ్డుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి అటవీ జిల్లాల ఆకస్మిక పర్యటన అందులో భాగంగానే విశ్లేషిస్తున్నారు.