ఔను దక్షిణ భారత దేశంలోనే ఇటువంటి మోసగాడి గురించి మీరు విని ఉండరు. ఎందుకంటే తన స్థాయి హోదా సౌత్ ఇండియాలోనే మరొకరికి లేదని చెబుతూ మోసగించడమే ఇతని ప్రవృత్తి. సౌత్ ఇండియాకు సెంట్రల్ విజిలెన్సు ఆఫీసర్ అంటాడు. వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపాల్ జడ్జి విజిలెన్సు ఆఫీసర్ గా నియామక పత్రం ఇచ్చినట్లు, హైకోర్ట్ నుండి మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపికైనట్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అరుదుగా ఉండే అత్యున్నత పోస్టులో సౌత్ ఇండియా కు తాను ఒక్కడినే అని చెబుతాడు.
అధికారి పోస్టులు ఏవైనా నకిలీ ధృవ పత్రాలతో తాను ఆ పోస్టులకు ఎంపికైనట్లుగా తప్పుడు ఆర్దర్లు సృష్టిస్తాడు. తాను చేయదలచుకున్న మోసానికి ఏది సరితూగుతుందో పసిగట్టి అమాయక ప్రజలను బోల్తా కొట్టిస్తాడు. పైసా కష్టం చేయకుండా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి కోట్ల రూపాయలు డబ్బులు లాగుతూ అదే స్థాయిలో ఖర్చు చేస్తాడు. తన మోసాలకు పరిమితి లేకుండా కొనసాగిస్తూ అమాయక ప్రజలను మోసం చేయడంలోనూ సౌత్ ఇండియా ఘరానా మోసగాడు కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసు చిక్కాడు. ఆద్యంతం ఆసక్తిగొలిపే ఈ మోసగాడి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుత వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన దోమల రమేష్ హుజరాబాద్ లోని డిసిఎంఎస్ కాంప్లెక్స్ లో సివిల్ పంచాయతీలు పరిష్కరించే కార్యాలయం తెరిచాడు. జిల్లా సివిల్ కోర్ట్ విజిలెన్స్ అధికారిగా తనను వరంగల్ జిల్లా జడ్జి నియమించినట్లుగా నియామక ఉత్తర్వులను సృష్టించాడు. తనకుతానే అధికారిగా పరిచయం చేసుకునేందుకు ఫేస్బుక్ సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసుకుంటున్నాడు. కోర్టు పేరు చెప్పి అమాయక ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నాడు.
గతంలో తాను స్కూల్ అసిస్టెంట్ గా పని చేసినట్లుగా నకిలీ ఆర్దర్లు సృష్టించి మోసాలకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. వివిధ న్యాయస్థానాలలో పోస్టులను భర్తీ చేయిస్తానని ప్రజల నుండి డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం వరంగల్ డిస్ట్రిక్ట్ సివిల్ కోర్ట్ జ్యుడీషియల్ విజిలెన్స్ ఆఫీసర్ గా నమ్మించేందుకు రెండు కార్లను కొని వాటికి జ్యుడీషియల్ శాఖకు సంబంధించిన స్టిక్కర్లను అమర్చాడు. దేశం మొత్తంలో జ్యూడిషల్ విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులు రెండే ఉంటాయి అందులో నార్త్ ఇండియా ఒకరు , సౌత్ ఇండియా మొత్తానికి నేను ఒక్కడినే, తన ద్వారా కాని పని ఏదీ ఉండదని నమ్మిస్తాడు .
ఏ ప్రభుత్వ శాఖలో అయినా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తానంటూ నమ్మబలుకుతాడు. గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడైన కైత రామచంద్రంను పరిచయం చేసుకుని సదరు సింగరేణి కార్మికుని కొడుకుకు GHMC లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం , అతని స్నేహితుడు దశరథం మేనల్లుడు కి విద్యుత్ శాఖలో ఉద్యోగం, అతని బావమరిది భార్యకు పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ. 40 లక్షలు వసూలు చేసాడు. అప్పుల రూపంలో కూడా లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఇప్పటి వరకు సుమారుగా నాలుగు కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్లుగా విచారణలో తేలింది.
అందరిని నమ్మించేందుకు ఆయా శాఖలకు చెందిన గుర్తింపు కార్డులు, పేస్లిప్ లను చూపిస్తూ వస్తున్నాడు. ఈ మోసగాడు రమేష్ 2011లో మొదటగా గోదావరిఖని సమీపంలోని ఎలకలపల్లికి చెందిన స్వప్న అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య ఉండగానే 2014 మే 18న కేశవపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నాడు. అనుమానం వచ్చిన రెండవ భార్య మొదటి భార్య బ్రతికుండగానే తనను వివాహం చేసుకున్నాడని కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో రమేష్ అతని కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. ఆ తర్వాత రెండో భార్య విడాకులు తీసుకుంది. ఇతని నిర్వాకాలను వివరంగా పరిశీలిస్తే…
-AV. పార్ధసారధి, ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి కరీంనగర్ & కె.వి. విద్యాసాగర్ రావు గార్ల ద్వారా ఇతడికి ఆదిలాబాద్ వారు జూనియర్ అసిస్టెంట్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా ఫేక్ ఆర్డర్ కాపీని 2018 మార్చిలో తయారు చేశాడు.
– అంతేగాక K.V.విద్యాసాగర్ రావు, ఆదిలాబాద్ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ & సేషన్స్ జడ్జి ఇతడికి 2,75,000/- రూపాయలు చెక్ ద్వారా ఇచ్చినట్లుగా 2018లో ఫేక్ చెక్ తయారు చేశాడు.
– 06.03.2020 లో ఫైనాన్సియల్ సర్వీస్ అథారిటీ దుబాయ్. రీజినల్ ఆఫీస్ ధ్వారా 5,33,00,000/- రూపాయలు ఫండ్ విడుదల అయినట్లుగా ఆర్డర్ తయారు చేశాడు.ఈ సర్టిఫికెట్ ను గూగుల్ నుండి డౌన్లోడ్ చేసి ఒరిజినల్ గా నమ్మించాడు.
– విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి 15.03.2018 లో ఇతనికి జూనియర్ లెక్చరర్ గా ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంచిర్యాలలో అపాయింట్మెంట్ అయినట్లుగా ఫేక్ ఆర్డర్ కాపీని తయారు చేశాడు.
– తేదీ 19.09.2016 రోజున రామంగుండం తహసీల్దార్ ఇతనికి సర్వే నెంబర్ 125/a/2 లో 152చ,గజాల స్థలం గుంటూరుపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటి కోసం కేటాయించినట్లు ధ్రువీకరించిన నోటరీ బాండ్ పేపర్ ఫోర్జరీ ద్వారా తయారు చేశాడు.
– ఇతనికి RBI అకౌంట్ నుండి ఐదు కోట్ల రూపాయలు వచ్చినట్లు దానికి గాను GST ఆరు లక్షల ఐదు వేల రూపాయలు చెల్లించాలని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ న్యూ ఢిల్లీ పేరు మీద ఫేక్ లెటర్ తయారు చేశాడు.
– 2017 ఫిబ్రవరిలో SBH గోదావరిఖని బ్రాంచ్ పేరు మీద ఫేక్ అకౌంట్ రూపొందించి (A/c No : 62315248515) ఇందులో కోట్ల రూపాయలు ఉన్నట్లుగా స్టేట్మెంటు ద్వారా నమ్మించాడు.
– 2017 అక్టోబర్ లో సాలరీ సర్టిఫికెట్ ZPHS రామకృష్ణాపూర్ లో స్కూల్ అసిస్టెంటుగా విధులు నిర్వర్తిస్తున్నట్లు ఐడి కార్డు తయారు చేసుకున్నాడు.
– సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు కైత రామచంద్రం, గోదావరిఖని అను వ్యక్తికి ఇవ్వవలసి ఉన్నట్లుగా ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు లభ్యమయ్యాయి. ఈ నాలుగు కోట్ల రూపాయలు కైత రామచంద్రంను నమ్మించి మోసం చేసి అతని ఆస్తులు (రెండు ఇండ్లు) అమ్మించి, అతని మధ్యవర్తిత్వం ద్వారా తన స్నేహితుల డబ్బులు కూడా తీసుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇతనికి స్థిరాస్థులు ఉన్నట్లుగా నకిలీ రిజిస్టర్డ్ స్టాంప్ పేపర్లు తయారు చేసుకున్నాడు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో పాటు విచ్చలవిడిగా జల్సాలు చేయడం అలవాటుగా మార్చుకుని మోసాలు చేయడాన్ని కొనసాగిస్తున్నాడు, ఇతను కైత రామచంద్రం ను నమ్మించి మోసం చేసి తీసుకున్న డబ్బులతో నిత్యం హైదరాబాద్ వెడుతూ , జల్సాలకు అలవాటుపడి ఇష్టం వచ్చినట్లు డబ్బులను ఖర్చు చేస్తూ చుట్టూ ప్రక్కల వారికి తాను ఓ కోటీశ్వరునిగా నమ్మిస్తూ వస్తున్నాడు..
ఇతని కదలికలపై అనుమానం వచ్చిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా నేరాలకు పాల్పడిన నిందితుడు దోమల రమేష్ నుంచి మొత్తం 13 నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి. బి. కమలాసన్ రెడ్డి వివరించారు. నిందితునిపై ఎల్ఎండీ, హుజూరాబాద్, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశామన్నారు. ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో ధైర్యంగా ఫిర్యాదు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి సూచించారు.