గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఎన్కౌంటర్ ఘటన ద్వారా సంచలన ఐపీఎస్ అధికారిగా ప్రాచుర్యం పొందిన కె. విజయ్ కుమార్ ఆదివారం తెలంగాణా-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం విజయ్ కుమార్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్ సెక్యూరిటీ అడ్వయిజర్ గా వ్యవహరిస్తున్నారు.
విజయ్ కుమార్ వెంట సీఆర్పీఎఫ్ డీజీ ఏపీ మహేశ్వరి, తెలంగాణా డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, నక్సల్ స్పెషల్ డీజీ అశోక్ జునేజా, ఛత్తీస్ గఢ్ సీఆర్పీఎఫ్ ఆపరేషన్స్ డీఐజీ ప్రకాష్, బస్తర్ రేంజ్ డీఐజీ పి. సుందర్ రాజ్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల ఎస్పీలు సునీల్ దత్, సంగ్రామ్ సింగ్ పాటిల్ సహా పలువురు ఇతర సీనియర్ పోలీసు అధికారులు ఉన్నారు.
ఆయా పోలీసు అధికారులు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సరిహద్దుల్లోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు, పరిణామాలపై చర్చించారు.
తీవ్రవాద కార్యకలాపాల కట్టడికి తెలంగాణా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మధ్య అనుసరించాల్సిన అంతర్రాష్ట్ సహకారంపై పరస్పరం చర్చించారు. ఈ విషయంలో రాష్ట్రాల, కేంద్ర బలగాల సమన్వయం, తదితర అంశాలపై కూడా లోతుగా సమీక్షించారు.