గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదులో టీఆర్ఎస్ అవకతవకలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న విషయాన్ని భారత ఎన్నికల సంఘం సీఈవో శశాంక్ గోయల్ దృష్టికి తీసుకుపోయినట్టు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. సీఈవోను కలిసిన అనంతర టీజేఎస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం…
నకిలీ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్లు పెట్టి విపరీతంగా బోగస్ ఓట్లు నమోదు చేసేలా టీఆర్ఎస్ పార్టీ రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నదని, దీన్ని నిలువరించాలని టీజేఎస్ కోరగా, తప్పక చర్యలు ఉంటాయని సీఈవో అన్నారు.
ఆన్ లైన్ నమోదు చేసుకున్నా కూడా తప్పనిసరిగా తమకు సర్టిఫికెట్లు ఇవ్వాలని కొందరు BLOలు, MROలు చెప్తుండటాన్ని టీజేఎస్ తప్పుపట్టగా, ఎమ్మార్వోలు, బీఎల్ఓలు అట్లా అనడానికి వీల్లేదని, వారికి క్లారిటీ ఇస్తామని శశాక్ గోయల్ అన్నారు.
ఆన్ లైన్ నమోదుకు డిగ్రీ సర్టిఫికెట్లపై గెజిటెడ్ సంతకం అవసరం లేదని కూడా శశాంక్ స్పష్టం చేశారు.
బోగస్ ఓట్ల నివారణకు ఓటర్ల తుదిజాబితా ప్రతి గ్రామ పంచాయతీలోనూ ప్రదర్శించాలని, ఆన్ లైన్ లో కూడా ఉంచాలని టీజేఎస్ కోరగా అందుకు గోయల్ అంగీకరించారు.
ఆఫ్ లైన్ లో Form 18 సబ్మిషన్లను కొందరు ఎమ్మార్వోలు తీసుకోవడం లేదని, LRS పని ఒత్తిడిని కారణంగా చెపుతున్నారని, ఇది రాజ్యాంగబద్ద ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించకపోవడమేనన్న టీజేఎస్ వాదనతో ఏకీభవిస్తూ, అట్లా జరగకుండా చూస్తామని సీఈవో హామీ ఇచ్చారు.
సీఈవో శశాంక్ గోయల్ ను కలిసిన ప్రతినిధి బృందంలో టీజేఎస్ పార్టీ నాయకులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, రాజమల్లయ్య, శ్రీశైల్ రెడ్డి, శ్రీధర్ కూడా ఉన్నారు.