తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు కాస్త ‘ఎటకారం’ ఎక్కువని ప్రతీతి. ఈ వెటకారం గోదావరి నీళ్ల ద్వారా వచ్చిందని కూడా పలువురు చెబుతుంటారు. దీన్నే తెలంగాణా మాండలికంలో ‘ఎక్కిరిచ్చుడు’ అంటుంటారు. వరద రాజకీయాలు చేసే రాజకీయ నేతల తీరును వెక్కిరిస్తూ గొల్లప్రోలు ప్రజలు ఏర్పాటు చేసిన ఓ ‘ఎటకారపు’ బ్యానర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ బ్యానర్ ద్వారా గొల్లప్రోలు ఈబీసీ కాలనీవాసులు చెబుతున్నదేమిటంటే… అక్కడ వరద వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారట. వరదకు వార్షికోత్సవం ఏమిటి? అని ఆశ్చర్యపోకండి. అదే మరి తూ.గో. జిల్లా ఎటకారమంటే!
ముప్పయి ఏళ్లుగా ఇక్కడ వరదలు వస్తూనే ఉన్నాయట. ఎప్పటిలాగే ఈయేడు కూడా వరద ముంపునకు గురైన తమ ప్రాంతానికి విచ్చేయుచున్న ప్రజాప్రతినిధులకు ఇదే మా స్వాగతం అంటూ గ్రామ పొలిమేరల్లో ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు.
స్వాగతం, సుస్వాగతం… 30వ వరద వార్షికోత్సం… వస్తున్నారు, చూస్తున్నారు, వెళుతున్నారు… అంటూ గొల్లప్రోలు ఈబీసీ కాలనీ ప్రజలు తూ.గో. జిల్లా ఎటకారాన్ని మసాలా దట్టించి మరీ ప్రజాప్రతినిధులకు కడుపారా వడ్డించారు. ఆయా బ్యానర్ ను దిగువన మీరూ చూసేయండి మరి!
![ts29 gollaprolu](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/10/gollaprolu.jpeg?resize=788%2C525&ssl=1)