ఖమ్మం నగరంలో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ముస్తాఫానగర్ లోని ఓ సంపన్న కుటుంబంలో పనిమనిషిగా పని చేస్తున్న 13 ఏళ్ల బాలికపై ఆ ఇంటి యజమాని కుమారుడు అత్యాచారయత్నం చేశాడు. అందుకు బాలిక ప్రతిఘటించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాదాపు 70 శాతం కాలిన గాయాలతో పల్లెగూడెం గ్రామానికి చెందిన ఆ మైనర్ బాలిక ప్రస్తుతం ఖమ్మంలోని వినోదా థియేటర్ సమీపంలో గల ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ దురాగతానికి పాల్పడిన సంపన్న కుటుంబ యజమాని కుమారుడు బాలికను తీవ్రంగా భయపెట్టినట్లు తెలుస్తోంది. విషయం ఎవరికైనా చెబితే నీతోపాటు నీ తల్లిదండ్రులను కూడా చంపేస్తానని హెచ్చరించినట్లు సమాచారం. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా మభ్యపెట్టి ఆసుపత్రిలో రహస్యంగా చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. అంతేగాక బాధిత బాలిక కుటుంబానికి రూ. 1.50 లక్షలు ఇస్తామని కూడా సంపన్న కుటుంబం ప్రలోభానికి గురిచేసినట్లు తెలిసింది.
అయినప్పటికీ ఈ దురాగతం వెలుగు చూసింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత కుటుంబీకులు ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తనపై జరిగిన దురాగతాన్ని ఆ బాలిక వివరించిన వీడియో కూడా ఘటన పూర్వాపరాలకు ప్రబల నిదర్శనంగా నిలుస్తోంది.
ఫొటో: ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలిక