ఈనెల 15 నుంచి 50 వేల వరకు ఉన్న పాత పంట రుణాలు మాఫీ చేయాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు, వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, పత్తి పంట సాగు తదితర వ్యవసాయ అంశాలపై ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశం చర్చించింది. అదే క్రమంలో పత్తిసాగు పై ప్రత్యేకంగా చర్చించిన కేబినెట్ తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల సాగును ఇంకా పెంచాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచే దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు పంట రుణాల మాఫీకి సంబంధించిన వివరాలను ఆర్ధిక శాఖ కేబినెట్ ముందుంచింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై భారం వల్ల, గత రెండు సంవత్సరాలుగా రూ. 25,000 (ఇరవై ఐదు వేలు) వరకు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేశారు. రూ. 25 వేలకు పైబడి లక్షలోపు ఉన్న పాత పంట రుణాలన్నీ పెండింగులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు 50,000 (యాభై వేలు) వరకున్న పాత పంట రుణాల మాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్ ఆదేశించింది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.

Comments are closed.

Exit mobile version