తెలంగాణా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం అటవీ ప్రాంత జిల్లాలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో డీజీపీ ఈమేరకు ఏరియల్ సర్వే నిర్వహించారు. జిల్లాలోని మంగి, తిర్యాని అటవీ ప్రాంతాల్లోనేగాక మహారాష్ట్ర సరిహద్దుల్లో గల ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహిస్తూ పర్యటించడం విశేషం. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ప్రభుత్వానికి లొంగిపోతారనే వార్తల నేపథ్యంలో డీజీపీ ఏజెన్సీ ప్రాంత పర్యటన సహజంగానే ప్రాధాన్యతను సంతరించుకుంది. సుమారు 40 రోజుల వ్యవధిలోనే డీజీపీ మహేందర్ రెడ్డి రెండోసారి అటవీ ప్రాంత జిల్లా ఆసిఫాబాద్ లో పర్యటించడం గమనార్హం.