దేశంలో తెలంగాణ పోలీసులకు గల గౌరవాన్ని, కీర్తిని మరింత పెంచే విధంగా పోలీస్ అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. కేసుల విచారణ, దర్యాప్తు, కోర్టుల్లో శిక్షల శాతం, పెట్రోలింగ్ వాహనాల పనితీరు, స్టేషన్ రైటర్లు, రిసెప్షన్, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ వర్టికల్స్ విభాగాలను సమీక్షించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ, నేరాల నియంత్రణ కోసం అన్ని స్థాయిల అధికారులు సమర్ధవంతంగా పనిచేస్తూ నిందితులకు న్యాయస్థానాల ద్వారా శిక్షలు పడే విధంగా చేయాలన్నారు. తద్వారా ప్రజలలో పోలీసులపట్ల నమ్మకాన్ని మరింత పెంచుతూ, ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వరించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణ విషయంలో రాజీ లేకుండా సమర్ధవంతంగా పని చేస్తున్నామని డీజీపీ తెలిపారు.రానున్న రోజుల్లో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళల రక్షణా చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందన్నారు.

పెరిగిపోతున్న సైబర్ నేరాలను అదుపు చేయడంతో పాటు ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అవగాహన కల్పించడం, అన్ని స్థాయిల పోలీస్ అధికారులకు సైతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అవగాహన కల్పించడం లక్ష్యంగా రూపొందించిన ఇన్వెస్టిగేటర్స్ డైరెక్టరీ ఫర్ సైబర్ వారియర్స్ 2.0 పుస్తకాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో అనుభవజ్ఞులైన సైబర్ నిపుణుల ద్వారా ఎన్నో విషయాలను పొందుపరచినట్లు డీజీపీ తెలిపారు.

ఈ సందర్భంగా ఫంక్షనల్ వర్టికల్స్ అమలులో 2020-21 సంవత్సరాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 223 పోలీస్ స్టేషన్లకు, అధికారులకు అవార్డులు, పురస్కారాలను డీజీపీ మహేందర్ రెడ్డి అందజేశారు.

Comments are closed.

Exit mobile version