తెలంగాణా సీఎం కేసీఆర్ నోట ఇటీవలి కాలంలో ఓ కొత్త మాట వినిపిస్తోంది. ఈ మాటలో తప్పు పట్టాల్సిన ప్రత్యేక అంశమేమీ లేకపోయినా, కేసీఆర్ వాడే ప్రతి మాటకు ఓ అర్థం, పరమార్థం ఉంటుందనేది రాజకీయ పరిశీలకుల అంచనా. ఇంతకీ కేసీఆర్ ఏమంటున్నారంటే…‘నేనూ కాపోన్నే, కాపుదనపు బిడ్డనే, నాకూ వ్యవసాయం ఉంది.’ అని పదే పదే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఈనెల 29న మేడ్చల్ జిల్లాలో ధరణి పోర్టల్ ప్రారంభించిన సమయంలో, నిన్న కొడకండ్లలో రైతువేదిక సభలోనూ సీఎం కేసీఆర్ ‘కాపు’ పదాన్ని పదే పదే ఉపయోగించడం విశేషం. అసలు కేసీఆర్ కొత్తగా ఈ ‘కాపు’ నినాదాన్ని ఎందుకు ఎత్తుకుంటున్నారు? దాని వెనుక గల ఆసక్తికర రాజకీయ కోణాలేమిటి? ఇదీ తాజా చర్చ.
‘‘నేనూ కాపుదనపు రైతు బిడ్డనే.., రైతుల కష్టాలన్నీ నాకు తెలుసు. అందుకే ఇన్నాళ్లూ అరిగోస పడ్డ రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, రైతుబంధు సమితుల్లాంటి పథకాలను తెస్తున్నా.., రైతులను ఒక్కటి చేసేందుకు రైతు వేదికలు నిర్మిస్తున్నాం’’ అని సీఎం కేసీఆర్ తాజా బహిరంగ సభల్లో చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. అంతేగాకుండా, ‘‘నాకూ వ్యవసాయం ఉన్నది. ఎర్రవల్లిలో నేనూ వ్యవసాయం చేస్తున్నా.. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు సాగునీళ్లు లేవు, కరంటు లేదు, ఎరువులు, విత్తనాలు కూడా లేవు. అయినా ఆరుగాలం కష్టపడి, పండించిన పంటను అమ్ముకుందామనుకుంటే దళారుల దందాతో అడుగడుగునా దగా పడ్డరు. 2014లో నేను ముఖ్యమంత్రి అయ్యేనాటికి వ్యవసాయశాఖను చంపేశారు. కానీ, ఈనాడు తెలంగాణ స్వరాష్ట్రంలో ఒక్కొక్కటీ బాగు చేసుకుంటున్నం. మమ్మల్ని ఎవరూ అడగకున్నా రైతుబంధు పథకంతో పంటసాయం అందిస్తున్నం. ప్రతి రైతుకూ 5 లక్షల బీమా చేస్తున్నం. రైతులు దోపిడీకి గురికావద్దనే ఆన్ లైన్ ధరణి పోర్టల్ తీసుకొచ్చినం. రైతులను సంఘటితం చేసేందుకు వేదికను ప్రారంభిస్తుంటే రాజ్యం తెచ్చినంత సంతోషంగా ఉంది. ఒక రాష్ట్రంలోని రైతులంతా పండించిన ప్రతిగింజనూ కొన్న ఏకైక ప్రభుత్వం.. మన దేశంలో ఏదైనా ఉన్నదా అంటే.., అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే.’’ అని కూడా కేసీఆర్ చెబుతున్నారు.
తన తాజా ప్రసంగాల్లో సీఎం కేసీఆర్ అందుకున్న ‘కాపు’ నినాదం వెనుక కోణాలను పరిశీలిస్తే.., వాస్తవానికి ప్రధాన కాపు కులం నుంచే రెడ్డి, వెలమ, కమ్మ అనే ఉప కులాలుగా పరిణామం చెందాయని చరిత్ర పరిశోధకుల కథనం. కాపులకు కుల వృత్తి వ్యవసాయం తప్ప మరేమీ లేదంటారు. తెలంగాణలో కూడా రెడ్డి, వెలమ, కమ్మ కులస్తుల ప్రధాన వృత్తి కూడా వ్యవసాయమే కావడం గమనార్హం. ఇప్పటికీ గ్రామాల్లో రెడ్డి, వెలమ, కమ్మ కులాల వారిని పాత తరంవాళ్లు కాపోళ్లుగానే సంబోధిస్తారు.
ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్రంలో జనాభా పరంగా చూస్తే రెడ్డి, వెలమ, కమ్మ కులస్తులు తక్కువ శాతం ఉన్నారు. బీసీలైన మున్నూరుకాపులు అత్యధిక శాతంగా ఉన్నారు. అందుకే భవిష్యత్తులో ఐక్య ‘కాపు’ నినాదం లేవదీసి, కాపు ఉప కులాలన్నింటినీ ఏకం చేసి, రాష్ట్రంలో, కేంద్రంలో ఎక్కడైనా సంఖ్యాపరంగా తమకు ఎదురులేకుండా చేసుకునేందుకు ఇప్పటి నుంచే కేసీఆర్ రచిస్తున్న రాజకీయ వ్యూహం కూడా కావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
సబ్బండ వర్ణాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన కేసీఆర్ కు ప్రధాన కాపు కులాన్ని, దాని ఉప కులాల్ని ఒక్కటి చేయడం పెద్ద లెక్కలోనిది కాదని, సాధ్యమవుతుందనే అధికార వర్గాల అభిప్రాయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, తద్వారా ఒనగూరే తక్షణ ప్రయోజనంపైనా చర్చ జరుగుతోంది. కేంద్రంపై ధ్వజమెత్తి, ఢిల్లీలో చక్రం తిప్పడానికి కేసీఆర్ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఇటీవల తీసుకొచ్చిన రైతు చట్టాలు మాత్రమేనంటున్నారు. ఇవి రైతులకు వ్యతిరేకంగానూ, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని, వీటిపై దేశవ్యాప్తంగా ఉద్యమిస్తానని, జాతీయస్థాయిలో అన్నిపార్టీల మద్దతు కూడగడతానని కేసీఆర్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించడం ఈ సందర్భంగా గమనార్హం.
వాస్తవంగా ఇప్పటికిప్పుడు ఢిల్లీలో పాగా వేయాలంటే కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలనే ఏకైక ఆయుధంగా, అస్త్రంగా మారిందంటున్నారు. వీటిని వ్యతిరేకిస్తే దేశవ్యాప్తంగా రైతుల మద్దతు కేసీఆర్ కు లభిస్తుందని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నిన్నటి కొడకండ్ల సభలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని, బీజేపీ నేతలను టార్గెట్ గా చేసుకుని కేసీఆర్ తన ప్రసంగాన్ని సాగించడం గమనార్హం. పిడికిలెత్తి కేంద్రంపై పోరాడాలని సీఎం రైతులకు పిలుపునిచ్చారు. రైతుగా, కాపోనిగా, హృదయపూర్వకంగా దేవునికి దండం పెట్టి చెబుతున్నా అని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి నిన్నటి కొడకండ్ల రైతువేదిక సభలో సీఎం కేసీఆర్ దాదాపు రాజకీయ ప్రసంగమే చేశారని చెప్పక తప్పదు. ఇందుకు దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యమా? లేక కేంద్రంపై నేరుగా యుద్ధానికి సన్నద్ధమవుతున్నారా? అనే సందేహాలను కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఆయా పరిణామాలను లోతుగా పరిశీలించినపుడు… తన తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తున్ని చేసేందుకు సమయం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా? ఎమ్మెల్సీగా ఎన్నికైన కూతురు కవితకు ప్రాధాన్యత గల పదవిని అప్పగించనున్నారా? అనంతరం జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ అడుగులు వడివడిగా పడనున్నాయా? కేంద్రంపై, బీజేపీ నేతలపై ఒంటికాలిపై లేస్తున్న కేసీఆర్ భవిష్యత్ రాజకీయాలను రచించుకుంటున్నారా? అందుకే ‘కాపు’ నినాదాన్ని కొద్దిరోజులుగా పదే పదే వల్లిస్తున్నారా? ‘నేనూ కాపోన్నే…’ అంటూ సీఎం చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఆసక్తికర కోణమిదేనా? ఇవీ రాజకీయ పరిశీలకుల మస్తిష్కంలో మెదలుతున్న సందేహాలు. సీఎం కేసీఆర్ ‘కాపు’ నినాదం వెనుక ఏ భవిష్యత్ రాజకీయ వ్యూహం దాగి ఉందనే విషయం బహిర్గతం కావడానికి వేచి చూడాల్సిందే!