‘పార్టీకి సహకరించేందుకు ప్రజలు భయపడుతున్నారు. తెలంగాణా వ్యాప్తంగా ప్రజలకు సమస్యలున్నప్పటికీ, పోరాడే పరిస్థితి లేదు. మెజారిటీ ప్రజలకు కొత్త భూములు దొరకడం, మూడు పంటలు పండడం, ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉండడంతో పార్టీ అవసరం అంతగా లేదు’ ఈ వాక్యాలు మావోయిస్టు పార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ డైరీలో ఉన్నాయట. తమకు లభ్యమైన భాస్కర్ డైరీలో ఆయా వాక్యాలు ఉన్నాయని, వాటిని భాస్కర్ తన డైరీలో రాసుకున్నాడని పోలీసులు ప్రకటించినట్లు తాజా వార్తల సారాంశం.
ఆడెల్లు అలియాస్ భాస్కర్ కోసం పోలీసులు కొన్ని నెలలుగా నిర్వారామ వేట సాగిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర పోలీస్ బాస్ మహేందర్ రెడ్డి స్వయంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రోజులతరబడి మకాం వేసి మావోయిస్టు పార్టీ నక్సలైట్ల కట్టడికి దిశా, నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే గత మార్చి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు భాస్కర్ దళం టార్గెట్ గా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆయా పరిణామాల్లోనే కడంబా అడవుల్లో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో ఇద్దరు భాస్కర్ దళ సభ్యులు మరణించారు. ముఖ్యనేత భాస్కర్ ఈ ఘటన నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. అనంతర పరిణామాల్లో ఓ దళ సభ్యుడు పోలీసులకు లొంగిపోయాడు.
ఈ నేపథ్యంలోనే భాస్కర్ రాసుకున్నట్లు చెబుతున్న డైరీ పోలీసులకు లభ్యమైంది. అందులో కీలక విషయాలున్నట్లు పోలీసులు ప్రకటించారు. ‘గత జూన్ నుంచి ఇప్పటి వరకు మనవాళ్లు ఐదుసార్లు దాడి నుంచి తప్పించుకున్నారు. కాండ్లమడుగులో సెప్టెంబర్ 23న అంబుష్ నుంచి తప్పించుకున్నాం.’ అని భాస్కర్ తన డైరీలో రాసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. తెలంగాణాలో పూర్వపట్టు సాధించేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భాస్కర్ తన డైరీలో రాసుకున్నట్లు పేర్కొంటున్న వాక్యాలు నిజమే అయితే తెలంగాణా పోలీసులకు భారీ ఊరటగానే ప్రస్తావించాల్సి ఉంటుంది. మావోయిస్టు పార్టీ విప్లవోద్యమ చరిత్రలో ఆయా వాక్యాలు ఓ ప్రకంపనలుగానే అభివర్ణించాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా, వారితో మమేకమై సాగించలేని పోరాటాలు, నిర్వహించలేని ఉద్యమాలు విజయవంతం కావని తరిమెల నాగిరెడ్డి వంటి విప్లవోద్యమ నాయకులు సూక్తీకరించిన నేపథ్యం ఈ సందర్భంగా స్ఫురణకు వస్తోందనే అభిప్రాయాలు విప్లవ కార్యకలాపాల పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఇదే దశలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న కూడా విప్లవోద్యమంపై తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీబీసీ తెలుగు న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జంపన్న విప్లవోద్యమంపై చర్చనీయాంశమైన విషయాలు మాట్లాడారు. అంతేగాక తన ఫేస్ బుక్ పేజీలో విప్లవోద్యమ ప్రస్తుత స్థితిపై క్తుప్త కథనం కూడా రాసుకున్నారు. ఆయన తన ఫేస్ బుక్ పేజీలో ఏమంటున్నారంటే…
‘‘భారత సమాజం నేడు పెట్టుబడిదారీ సమాజంగా పరివర్తన చెందిన స్థితిలో వ్యూహంలో మార్పు తప్పనిసరిగా ఉంటుంది. టార్గెట్లుగా భారత పెట్టుబడిదారీ వర్గం సామ్రాజ్యవాదులు. కార్మిక వర్గ నాయకత్వాన రైతాంగం పెటీబూర్జూవా వర్గం కలసి పోరాడాలి. విప్లవ మార్గం ప్రపంచ అనుభవంలో సాధారణంగా రెండు మార్గాలని మాత్రమే విప్లవ సాహిత్యంలో చెప్పబడుతోంది. కానీ వివిధ దేశాలలో ఆనాటి కాలం అక్కడి నిర్దిష్ట పరిస్థితిని బట్టి వేర్వేరు పద్దతుల్లో విప్లవాలు విజయవంతం చేసిన అనుభవాలు ఉన్నాయి. స్తూలంగా సార్వత్రిక తిరుగుబాటు, దీర్ఘ కాలిక సాయుధ తిరుగుబాట్లు అని చెప్పినప్పటకీ, మొత్తంగా చూసినప్పుడు పై రెండు మార్గాలలో సాయుధంగా మాత్రమే విప్లవం విజయవంతం అవుతుందనేది సాధారణమైనది.
అయితే వాటిని కొనసాగించే దానిలో ఆయా దేశ, కాల పరిస్థితులను బట్టి అనేకమైన మార్పులతో ఎత్తుగడలు ఉంటాయి. కాబట్టి నేడు భారతదేశం పెట్టుబడిదారీ దేశంగా మారిన కండీషన్ లో దీర్ఘ కాలిక సాయుధ విప్లవం పద్దతిలో సాధ్యం కాదు. గెరిల్లా జోన్స్ విముక్తి ప్రాంతాల లక్ష్యంతో మొదటి నుండి ఎర్ర సైన్య నిర్మాణం సాధ్యం కాదు. (మన ఆచరణ పరంగా సైతం వివిధ కోణాలలో వివరించడానికి ఇక్కడ సాధ్యం కాదు. మరొకచోట ఈ విషయంపై రాస్తాను) నేడు పరిస్థితి పాలకవర్గ ప్రభుత్వాలు నియంతృత్వ అణిచివేత విధానాలు తీవ్రంగా కొనసాగిస్తున్నప్పటికీ, చట్టపరిధిలో ప్రధానంగా కార్మికవర్గాన్ని రైతాంగాన్ని పెటీబూర్జూవా వర్గాన్ని, వివిధ సెక్షన్స్ ను అర్గనైజ్ చేయవలసి ఉంటుంది. సార్వత్రిక తిరుగుబాటు మార్గమే. విప్లవ వర్గాలైన కార్మిక రైతాంగ పెటీబూర్జూవా వర్గాలను చట్టపద్దతులలో సంఘటితం చేస్తూ రాజ్యాధికారం చేపట్టే దృష్టితో సార్వత్రిక పోరాటానికి సిద్దం చేయాలి.’’ ఇదీ విప్లవోద్యమ దిశపై జంపన్న అభిప్రాయం. ఇక బీబీసీ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారో దిగువన గల వీడియోలో చూడవచ్చు.