ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి… బ్యూరోక్రసీ కోణంలో దాదాపు ముఖ్యమంత్రి హోదాతో సరి సమాన స్థాయిగా అధికార వర్గాలు అభివర్ణిస్తుంటాయి. ఇటువంటి ఉన్నతాధికారి జారీ చేసిన ఓ ఉత్తర్వు దాదాపు బుట్ట దాఖలైందనే ప్రచారం తెలంగాణాలో కలకలం కలిగిస్తోంది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జారీ చేసిన ఓ ఉత్తర్వును అమలు చేయకుండా అనేక జిల్లా కలెక్టర్లు నెలల తరబడి చోద్యం చూస్తుండడం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెడితే…

రెవెన్యూ శాఖకు చెందిన పలువురు తహశీల్దార్లు, ఇతర అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో రెవెన్యూ అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున అక్రమంగా డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం నివేదించింది. ఈ తరహా వసూళ్లకు పాల్పడినవారి జాబితాలో తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు, వీఆర్ ఏలు, వీఆర్వోలు తదితరులు ఉన్నట్లు స్పష్టం చేసింది.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో ఒక్కో దరఖాస్తుదారు నుంచి కనిష్టంగా వెయ్యి నుంచి రూ. 10 వేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం మెమో. నెం. 7616/విజిలెన్స్. III-20201-1ద్వారా నివేదించింది.ఈ వసూళ్ల కోసం పలువురు ప్రజాప్రతినిధులను, సిబ్బందిని, దళారులను నియమించుకున్నట్లు కూడా నివేదికలో స్పష్టం చేసింది.

వాస్తవానికి ఈ నివేదిక గత జూన్ 19వ తేదీన రాగా, పలువురు జిల్లా కలెక్టరేట్లలో దీన్ని రహస్యంగా ఉంచినట్లు ప్రచారం జరిగింది. తహశీల్దార్లు, ఇతర అధికారులు, సిబ్బంది సహా మొత్తం 43 మందిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈమేరకు తగిన చర్యలు తీసుకుని నివేదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వు కూడా జారీ చేశారు.

గత జూన్ 19న చీఫ్ సెక్రటరీ జారీ చేసిన ఉత్తర్వు ప్రతిలోని ఓ భాగం (ఫైల్)

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అక్రమాలకు పాల్పడిన అధికారుల, సిబ్బంది జాబితాను వరంగల్ అర్బన్ (ప్రస్తుత హన్మకొండ), జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వు ప్రతిని కూడా పంపిస్తూ చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు.

అయితే చీఫ్ సెక్రటరీ నుంచి ఈ ఉత్తర్వు వెలువడి అయిదు నెలలు దాటినా ఇప్పటి వరకు ఎవరిపైనా, ఎటువంటి చర్యలు తీసుకోలేదని రెవెన్యూ వర్గాలే ప్రస్తావిస్తున్నాయి. పైగా విజిలెన్స్ నివేదికనే తప్పు పట్టే విధంగా రెవెన్యూ యూనియన్ల తరపున సోషల్ మీడియా వేదికగా పోస్టులు వెలువడడం ఈ సందర్భంగా గమనార్హం. అవినీతికి వంత పాడే కొందరు యూనియన్ నేతల ప్రాబల్యం ముందు చీఫ్ సెక్రటరీ జారీ చేసిన ఉత్తర్వు బుట్ట దాఖలైందనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి.

Comments are closed.

Exit mobile version