ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణా రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రగతి భవన్ లో కొనసాగుతోంది. మొదటగా రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సన్నద్దత,అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యం తదితర అంశాలపై కేబినెట్ సమీక్షించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు.

ఈ నేపథ్యంలోనే కరోనా పరీక్షలు మరిన్ని ఎక్కువగా చేయడానికి అవసరమైన ఏర్పాట్లు సన్నద్దతపై కేబినెట్ చర్చించింది. అదే సందర్భంలో కరోనా నుంచి ఒమిక్రాన్ పేరుతో కొత్త వేరియంట్ వస్తున్నదనే వార్తల నేపథ్యంలో ఈ కొత్త కరోనా వేరియంట్ గురించి వైద్య అధికారులు కేబినెట్ కు వివరించారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితిని తెలుపుతూ నివేదిక సమర్పించారు.

గత రెండు సంవత్సరాలుగా కరోనా కట్టడికోసం జరిగిన పురోగతి గురించి కేబినెట్ చర్చించింది. వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, అన్ని రకాల మందులు, పరికరాలు, మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని, అన్ని విధాలుగా తాము సంసిద్దంగా ఉన్నామని వైద్యాధికారులు కేబినెట్ కు వివరించారు.

రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లోని పరిస్థితులను సమీక్షించాలని, అన్ని రకాల మందులు, టీకాలతో సహా ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులను సమకూర్చుకోవాలని, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర వైద్యశాఖ సిద్దంగా వుండాలని కేబినెట్ ఆదేశించింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, అందుకు మంత్రులందరూ వారి వారి జిల్లాల్లో సమీక్షించాలని, అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల వారిగా టీకా ప్రక్రియను సమీక్షించి., అదిలాబాద్, కుమురంభీం నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, గద్వాల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.

Comments are closed.

Exit mobile version