ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయాల్సిందేనని ఆ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తీర్మానించింది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోదండరాం శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. కూసుమంచి మండలం పాలేరులో నిర్వహించిన టీజేఎస్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కోదండరాం అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ టీజేఎస్ జిల్లా కమిటీ సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిస్థితులను కోదండరాం తమ పార్టీ నేతలతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇటీవల కురిసన వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగులో గల కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు తక్షణమే చెల్లించాలని కూడా ఆయన కోరారు.
సమావేశంలో టీజేఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అంబటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు బత్తుల సోమయ్య, రాష్ట్ర నాయకుడు దర్మాజిన్, గుంటి రాంచందర్, శ్రీ నైల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫొటో: పాలేరుతో నిర్వహించిన టీజేఎస్ ముఖ్యుల సమావేశంలో కోదండరాం తదితరులు