• తాతా మధు జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా ఎదిగిన తీరు మాకు తెలియదా..?
  • పిల్లికి బిక్షం పెట్టని వాడు కూడా ఈ రోజు శీనన్న గురించి మాట్లాడుతున్నాడు
  • హుజురాబాద్, మునుగోడులో ధన రాజకీయాలు చేసింది మీ నాయకుడు కాదా…?
  • ఖమ్మం బీఆర్ఎస్ అధ్యక్షునిపై పొంగులేటి వర్గీయుల ఫైర్

ప్రగతి భవన్ లో చెప్రాసీగిరి వల్లే ఖమ్మం బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుకు పదవి లభించిందని మాజీ ఎంపీ పొంగులేటి వర్గీయులు విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఉన్న ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గల్లంతవుతుందని పేర్కొన్నారు. పిల్లికి బిక్షం పెట్టని వాడు కూడా ఈ రోజు శీనన్న గురించి మాట్లాడుతున్నాడని… శీనన్నను విమర్శించడం అంటే సూర్యుని మీద ఉమ్మి వేసినట్టేనని పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వర్గీయులు పేర్కొన్నారు. గత వారం పది రోజులుగా బీఆర్ఎస్ నేతలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తాతా మధు, రాములు నాయక్ సహా పలువురు నాయకుల ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఈ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు వక్తలు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబి స్వర్ణకుమారి, విజయభాయి, వైరా మున్సిపల్ ఛైర్మన్ సూతకాని జైపాల్ సహా ఇతర ముఖ్య నాయకులు మాట్లాడుతూ, ఉమ్మడి ఖమ్మంజిల్లాలో నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవడానికి మీ నాయకుడు కేసీఆరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని పార్టీలోకి ఆహ్వానించిన సంగతి మీకు తెలియదా? అని ప్రశ్నించారు. పొంగులేటికి 3 వేల కోట్ల రూపాయాలను కట్టబెట్టారని చెబుతున్న మీరు అందులో వెయ్యి కోట్లు తగ్గించి 2 వేల కోట్ల రూపాయాలను కట్టబెట్టినా శీనన్న ప్రస్తుతం తనకున్న మొత్తం ఆస్తులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజారాజ్యంలో టిక్కెట్టు కోసం ప్రయత్నించి టిక్కెట్టు రాని పక్షంలో అమెరికా వెళ్లిపోయిన తాతా మధు అక్కడి నుంచి తిరిగి ఖమ్మం వచ్చి ఏ విధంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ఎమ్మెల్సీగా, అధ్యక్షుడిగా ఎదిగిన తీరు ఈ జిల్లా ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. ఏడాది కాలంగా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న తాతా మధుకు అస్సలు పార్టీకి బైలా ఉన్నాయా లేదా అనే విషయం పైనా కనీస అవగాహన ఉందా అని నేతలు ప్రశ్నించారు. హుజురాబాద్, మునుగోడులో ధన రాజకీయాలు చేసింది మీ నాయకుడు కేసీఆర్ కాదా? అని విమర్శించారు. నాడు సోనియా గాంధీని దేవతగా కీర్తించి, నేడు దయ్యంగా ద్వేషిస్తున్న మీ నాయకుడు కేసీఆర్కు చిత్తశుద్ధి ఉన్నట్లేనా? అని మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నామన్నారు.

వైరా ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా లక్షలాది ప్రజల పక్షాన శీనన్న మాట్లాడిన ప్రతి మాటలో వాస్తవాలు ఉన్నాయని తెలిపారు. వాటిని జీర్ణించుకోలేని మీరు నేడు అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. జిల్లా, రాష్ట్ర ప్రజలు కాదు రాబోయే రోజుల్లో దేశ ప్రజలు గర్వించే స్థాయికి శీనన్న ఎదగనున్నాడని, అలాంటి నాయకులపై విమర్శలు తగవని తెలిపారు. 2014, 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంజిల్లాలో అప్పటి టీఆర్ఎస్ కు ఒకే ఒక్క సీటును మాత్రమే కట్టబెట్టారని, ఈసారి ఎన్నికల్లో ఆ ఒకటి కూడా బీఆర్ఎస్ కు దక్కదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బహిరంగ చర్చకు రావాలని పిలుస్తున్న తాతా మధు ఆహ్వానాన్ని మేము సాదరంగా స్వీకరిస్తున్నామని తేదీ, వేదిక, సమయం మీరు చెప్పినా సరే… మమ్మల్ని చెప్పమన్నా సరేనని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి మొదలుకొని, ధరణి సమస్యలు, రైతు సమస్యలు, ఇంకా అనేక రకాలైన ప్రజా సమస్యలపై చర్చించడానికి మేము సిద్ధంగానే ఉన్నామని మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి ఖమ్మజిల్లాలో శీనన్న ప్రభంజనం ఖాయమని ఈ సందర్భంగా ఉద్భాటించారు. ఈ సమావేశంలో కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, సురేష్, తిరుమలరావు, జారె ఆదినారాయణ, రాయల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments are closed.

Exit mobile version