ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హామీ మేరకు ఖమ్మం జిల్లా జర్నలిస్టులందరికీ ఏకకాలంలో ఇళ్లస్థలాలు, పట్టాలు ఇవ్వాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బ్యూరోలు, స్టాఫర్లు, రిపోర్టర్లు, డెస్క్, వీడియో, చిన్నపత్రికలు, స్వతంత్ర జర్నలిస్టులనే తేడా లేకుండా…గ్రామీణ, మున్సిపల్, నగర ప్రాంత వారనే వ్యత్యాసం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఏకకాలంలో ఇళ్ల స్థలాలు, పట్టాలతో పాటు ఇంటి నిర్మాణానికి తలా రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నున్నా మాట్లాడారు.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ఇతరత్ర సమస్యలపై తమ పార్టీ నిరంతరం పోరాడుతోందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సైతం ముఖ్యమంత్రిని కలిసి జర్నలిస్టుల కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పలుమార్లు కోరినట్లు తెలిపారు. నగర జర్నలిస్టుల కోసం ఐదు ఎకరాల ఎన్నెస్పీ స్థలం కేటాయిస్తూ గురువారం జీవో వెలువడిందని, నగరంలో 300కు పైగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు ఈ స్థలం మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఒక్కొక్కరికీ 200 గజాలు ఇవ్వాలని కోరారు. వీటన్నింటి కంటే ముందు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన విధివిధానాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇళ్లస్థలాల పట్టాల విషయంలో కొనసాగుతున్న ప్రక్రియ పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. జర్నలిస్టులు గందరగోళం, అపోహలకు లోనవుతున్నారని తెలిపారు. నగరంలోని కొందరు జర్నలిస్టుల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించటం, మరికొందర్ని విస్మరించటంతో మిగిలిన వారి పరిస్థితి ఏమిటో అర్థంకావట్లేదన్నారు.

జర్నలిస్టుల కోటాలో స్థలం ఇస్తున్నట్లు జీవో వెలువడగా బీపీఎల్ (దారిద్ర్య రేఖకు దిగువన) తరహా విచారణ నిర్వహించి, వివరాలు, ఆధారాలు సేకరించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని కోరారు. ఎన్ని గజాల స్థలం, ఏ ప్రాతిపదికన కేటాయిస్తారో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. జర్నలిస్టుల ఆదాయ, స్థిరచర ఆస్తుల వివరాలు సేకరించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నారు. కాబట్టి ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి స్పష్టత ఇవ్వాల్సిన ఆవసరం ప్రభుత్వ అధికారయంత్రాంగంపై ఉందన్నారు. అలాగే ఇండిపెండెంట్ జర్నలిస్టులు, చిన్న పత్రికల జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు, ఇతర వర్కింగ్ జర్నలిసులందరితో పాటు మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఏకకాలంలో ఇళ్లస్థలాలు, పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మూడు, నాలగు విడతలు అంటే న్యాయపరమైన అవరోధాలు ఏర్పడే అవకాశం లేకపోలేదని అనుమానం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వాలు 20 ఏళ్లుగా హామీ ఇస్తూనే ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రకటనతో జర్నలిస్టులు సంతోషపడ్డారని తెలిపారు. కానీ ఈ ప్రక్రియ కొనసాగుతున్న తీరును చూసి ఆందోళన గురవుతున్నారని చెప్పారు. వీటన్నింటికీ పరిష్కారం చూపించి వర్కింగ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియను సజావుగా ముగించాలని సిపిఐ (ఎం) డిమాండ్ గా పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, వై. విక్రమ్ పాల్గొన్నారు.

Comments are closed.

Exit mobile version