ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేేసేవాళ్లే తన వద్దకు వస్తారని, ఏ తప్పూ చేయనివారు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులు అద్దెకు ఉండరాదన్నరు. విలేకరుల ఇండ్లల్లో బోరు బావులన్నీ సీజ్ చేయాలన్నారు. మణుగూరు తహశీల్దార్ కార్యాలయం వేదికగా రేగా కాంతారావు విలేకరులపైనా, అధికారులపైనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకీ రేగా కాంతారావు ఏమంటున్నారంటే…. ఆయన మాటల్లోనే…

‘‘ఇప్పుడూ ప్రజలు ఉన్నరు… కొంత మంది ఒస్తరు నా దగ్గరికి.. తప్పు చేసినోడే నా దగ్గరకు ఒస్తడు. తప్పు చేయనోడు నా దగ్డరకు ఎందుకు ఒస్తడు వాడు? తప్పు చేసిండు కాబట్టే భయానికి నా దగ్డరికి ఒచ్చిండు. వాన్ని విడిపిస్తమా…? ఏదో ఒకటి చేస్తం. ఉరి అయితే తియ్యం గదా వాన్ని? నేను మీకు ఫోన్ జేస్త.. నా ఫోన్ ఎత్తకపోతే పబ్లిక్ లో నా వాల్యూ ఏమైతది…? చెప్పు నాకిది? ఫోన్ జేస్తే స్విచ్ఛాఫ్… ఖతం.. అడ్రస్ దొర్కడు. ఏమైద్దండీ… బండి పట్టుకొచ్చినవ్… కేసుల్ రాయి…ఇడిపిద్దమ్… దాన్ని ఉరి అయితే తియ్యవ్ గదా? వాడు పాపం పేదోడు… ఏదో చేసుకుంటుండు.దాన్ని పట్టుకుని ఒచ్చినవ్… ఎవరో విలేకర్లు జెప్పిండ్లని… విలేకరుల ఇంటిగ్గూడ పోదాం.. పర్మిషన్ లేకపోతే సీజ్ జెయ్యాలె గదా మనం…? ఫస్ట్ విలేకరుల ఇండ్లల్ల బోర్లన్నీ సీజ్ జెయ్యాలె.. నేనే చెప్తున్న… వాళ్లందరు అక్రమంగ కట్టిండ్రా… సక్రమంగ గట్టిండ్రా… ఇండ్లన్నీ చూసి రా ఫస్ట్… విలేకర్లయి చూసినంకనే మిగతాయి మణుగూరు మొత్తం చూద్దాం…వాళ్లయి సీజ్ చేసి రా… తర్వాత మీరు యాడ ఉంటాండ్రో…మీ ఇంటి కాయితాలు కూడా ఓనర్ ను అడిగి… దానికి పర్మిషనుందా? ఈ ఇల్లు పర్మిషన్ తోని కట్టిండ్రా…ఈడ ఏవేం చట్టాలున్నయ్..? చట్టాల్ని అతిక్రమించి ఎట్ల కట్టిండ్రు.. తర్వాత వీళ్లందరి మీద కేసు ఏస్తా… అందరి మీద ఏస్త.. మీమీద ఏస్త.. అసలు మీరు కిరాయికి ఉండొద్దు… కిరాయికి ఎట్లుంటరు మీరు..? మీరు నాన్ ట్రైబ్… కిరాయికి ఎట్లుంటరు మీరు..? అదిగూడ జెప్పు నాకు…’’ అని కాంతారావు వ్యాఖ్యానించారు. ఆయా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version