ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిరోధం విషయంలో మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాటేమిటి? పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని ఆయనెవరో సైంటిస్టు తనతో చెప్పినట్లు తెలంగాణా సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే ప్రకటించిన విషయం గుర్తుంది కదా? ఈ వ్యాఖ్య చేసిన స్వల్ప వ్యవధిలోనే కరోనా వైరస్ కట్టడికి సంబంధించి సీఎం కేసీఆర్ మరోసారి స్పందించారు. వెయ్యి కాకుంటే ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఈమేరకు యుద్ధ ప్రతిపదికన అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అది వేరే విషయం.

తెలుగు రాష్ట్రాల సీఎంల ప్రకటనపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్

తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ముందు బుక్కయ్యారు. కరోనా వైరస్ కు పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని జగన్ సైతం మీడియా సమావేశంలో ప్రకటించారు. అంతేకాదు బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించినా కరోనా వైరస్ చనిపోతుందని చెప్పారు. జగన్ బ్లీచింగ్ పౌండర్ వ్యాఖ్యలపై నెటిజన్లు సోషల్ మీడియాలో అడేసుకుంటున్నారు. అరెరె… బ్లీచింగ్ పౌడర్ గురించి, పారాసిటామల్ టాబ్లెట్ల గురించి అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనా దేశాధినేతలు తెలుసుకోలేకపోయారే అని వెటకరిస్తున్నారు.

సరే రాజకీయ నాయకులైన తెలుగు రాష్ట్రాల సీఎంల పారాసిటమాల్ టాబ్లెట్, బ్లీచింగ్ పౌడర్ స్టేట్మెంట్ల గురించి కాసేపు పక్కనబెడితే… వారం వారం టీవీ ఛానళ్లలో రాశిఫలాలు చదువుతూ భవిష్యవాణి వినిపించే ఓ పండితుడు ప్రజలకు ఏమని సెలవిస్తున్నారో తెలుసా? అష్టమూలికా, త్రిశూల్, కప్పు సాంబ్రాణి తదితర ఏవేవో పేర్లను, వస్తు సామాగ్రి పేర్లను ప్రస్తావిస్తూ వాటితో పొగ వేస్తే వైరస్ లు చనిపోతాయని చెప్పారు. పొగ ధాటికి అక్కడున్న బాక్టీరియా, చుట్టుపక్కల గల ప్రాంతాల్లోని వైరస్ లు ఏవైనా టోకున చనిపోతాయని కూడా సెలవిచ్చారు. ఇది పూర్వీకులు చెప్పిన మాటగా కూడా భరోసా ఇచ్చారు. ఈ తరహా రాశిఫలాలను సదరు ‘పెద్దాయన’ చదవడానికి ముందే తమ ధూప, దీప, ‘పొగ’ ఉత్పత్తుల వాణిజ్య ప్రకటన కూడా వస్తుంది. ఈ విషయాన్ని అతని రాశిఫలాలను విని, పాటించేవారు గుర్తించాలి మరి. ‘కరోనా వైరస్ సైతం కాదు వ్యాపారానికి అనర్హం’ అన్నమాట.

Comments are closed.

Exit mobile version