కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రైవేటు విద్యా సంస్థలను ఆదుకోవాలని లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్ ( సీజీటీఎంఎస్ఈ ) పథకంలో చేర్చాలని ఆయన కోరారు. ఈమేరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను ఆదుకోవాలని కోరుతూ గురువారం ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర ఆర్ధిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా చాలా రంగాలు నష్టపోయాయని నామ నాగేశ్వర్ రావు అన్నారు . కోవిడ్ వల్ల ప్రైవేటు పాఠశాలలు దాదాపుగా మూతపడే దశలోకి నెట్టబడ్డాయన్నారు. ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రైవేటు పాఠశాలలు నడవడం లేదన్నారు. దేశవ్యాప్తంగా 4.5 లక్షల పాఠశాలలుండగా, అందులో 95 శాతం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్నారు. పాఠశాలలు నడవక పోవడంతో పాఠశాలల యాజమాన్యాలు అద్దెలు చెల్లించడం, బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలను చెల్లించలేక పోతున్నాయన్నారు.

ప్రైవేటు పాఠశాలలు నడకవపోవడంతో సుమారు 5 కోట్ల మంది జీవనోపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ప్రైవేటు పాఠశాలల బస్సుల ఇన్సూరెన్స్ కూడా చెల్లించ లేకపోతున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు బస్సులకు ఏక మొత్తంలో ఇన్సూరెన్స్ లు చెల్లించే విధానంలో కాకుండా నెలవారీగా చెల్లించే విధంగా మినహాయింపులు ఇవ్వాలని కోరారు. దాదాపు 20 కోట్ల మంది విద్యార్థులకు విద్యాబుద్ధలు నేర్పుతున్న ప్రైవేటు విద్యా సంస్థలను సానుభూతితో ఆదుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు.

కోవిడ్ సంక్షోభం నుంచి రిటైల్ వ్యాపారులకు చేయూత అందించడం కోసం ప్రభుత్వం ప్రారంభించిన క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్ ( సీజీటీఎంఎస్ఈ) పథకం ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కరోనాతో నష్టపోతున్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను సీజీటీఎంఎస్ఈ పథకంలో చేర్చాలని, లేదంటే బ్యాంకుల నుంచి ఇదే పథకంలో ప్రైవేటు యాజమాన్యాలకు రుణాలను అందించాలని ఎంపీ నామ ఆర్ధిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Comments are closed.

Exit mobile version