అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇదో విచిత్ర సన్నివేశం. సిట్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉండగానే, ఆ పార్టీ నేతలకు చెందిన టీవీ ఛానల్ జర్నలిస్ట్ టికెట్ కోసం తనదైన శైలిలో చేస్తున్న ప్రయత్నాలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికలకు మరో ఆరు నెలల వ్యవధి ఉండగానే అధికార పార్టీలో రాజకీయ వేడి పుడుతున్న దృశ్యాలు ఆసక్తికరంగా మారాయి.
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన పల్లా రాజేశ్వరరెడ్డి ఈసారి జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వచ్చే మార్చిలో జరిగే ఈ ఎన్నికల్లో పోటీకి పల్లా రాజేశ్వరరెడ్డి విముఖంగా ఉన్నారని టీ న్యూస్ లో పనిచేస్తున్న పీవీ శ్రీనివాస్ అనుచరులు చెబుతున్నారు. ఈ విషయంలో పల్లా రాజేశ్వరరెడ్డిగాని, ఆయన అనుచరగణం మాత్రం నోరు మెదకపకపోవడమే గమనించాల్సిన అంశం. తాను మళ్లీ పోటీ చేస్తాననిగాని, తనకు ఆసక్తి లేదనిగాని రాజేశ్వరరెడ్డి ఎక్కడా స్పష్టీకరించిన దాఖలాలు లేవు.
కానీ పల్లా రాజేశ్వరరెడ్డి ఈసారి పోటీ చేయరని, ఆయనకు ఇంట్రస్ట్ లేదని మాత్రం ఓ వర్గం గత కొన్ని నెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తుండడం విశేషం. ఇంకోవైపు పల్లా అభ్యర్థిత్వం వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారనే ప్రచారం కూడా వేగంగా జరుగుతోంది. మళ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని రాజేశ్వరరెడ్డికి సీఎం కేసీఆర్ సంకేతాలిచ్చినట్లు ఆయా ప్రచారపు సారాంశం. ఈ విషయంలో పార్టీ నాయకత్వం కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు.
కానీ జర్నలిస్ట్ పీవీ శ్రీనివాస్ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అంశంలో ‘దూకుడు’ ప్రదర్శిస్తున్నట్లు తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయన ఆదివారం ఖమ్మంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఆశించే అర్హత తనకుందని ప్రకటించారు. తన అభ్యర్థిత్వానికి మద్ధతునివ్వాలని పలు వర్గాలను ఆయన అభ్యర్థించారు. టికెట్ విషయంలో తాను కేసీఆర్ ను, కేటీఆర్ ను కలిశానని, ఆయా నేతల సంపూర్ణ సహకారంతో తాను ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తూ చెప్పారు.
అయితే ఇదే దశలో పీవీ శ్రీనివాస్ పార్టీపరంగా టికెట్ కోరలేదని మరోవర్గం ప్రచారం చేస్తోంది. తాను జర్నలిస్టుగా మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని, తనకు టీఆర్ఎస్ పార్టీ మద్ధతునివ్వాలని ఆయన కోరారని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఓ వామపక్ష తీవ్రవాద పార్టీ అనుబంధ సంస్థతో పూర్వ బంధం గల పీవీ శ్రీనివాస్ టీఆర్ఎస్ అభ్యర్థిగా అధికారికంగా ఖరారైతే కొన్ని వర్గాలు ఓటుపరంగా వ్యతిరేకంగా మారవచ్చనే ఆందోళనే ఇందుకు కారణమని అంటున్నారు.
ఈ వ్యాఖ్యలు కాస్తా సీఎం కేసీఆర్ వరకు చేరాయని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే నిజమైతే, ఇటువంటి ‘మెలిక’కు సీఎం కేసీఆర్ అంగీకరిస్తారా? అనే సంశయాలు కూడా ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే విషయంలో పల్లా రాజేశ్వరరెడ్డి తన అంతరంగమేంటో వెల్లడి చేయని పరిస్థితుల్లో పీవీ శ్రీనివాస్ ఓ అడుగు ముందుకేసి మరీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుండడం విశేషం.
ఇదిలా ఉండగా వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై పలువురు జర్నలిస్టులు కూడా కన్నేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్న జయ సారధి రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. సీపీఐ పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీ పోటీలో దిగనున్నట్టు ఆయన తన సహచరులతో చెప్పారు. తనకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుందనే ఆశాభావంతో జయసారథి ఉన్నప్పటికీ, ఆ పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూడకుండా తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
అదేవిధంగా రాణీ రుద్రమ అనే పూర్వ జర్నలిస్టు కూడా ఇదే స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. యువ తెలంగాణా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న రాణీ రుద్రమ ఆదివారం ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తీన్మార్ మల్లన్న, ఎలక సైదులు తదితర జర్నలిస్టులు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సంసిద్ధమవుతున్నారు.