“We have information from various sources that Ramanna, the secretary of Dandakarnya Special Zonal Committee (DKSZC) of Maoists, died on Saturday night and was cremated at a forest between Pamed and Basaguda villages in Bijapur district,” Inspector General of Police, Bastar range, Sundarraj P said.

అయిదు రాష్ట్రాల అటవీ ప్రాంతంతో కూడుకున్న మావోయిస్టు పార్టీ దండకారణ్యం కమిటీకి నాయకత్వం వహిస్తున్న రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్ననిజంగానే గుండెపోటుతో మరణించారా? రామన్న మృతి నిజమేనని బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ ప్రకటించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. గత శనివారం గుండెపోటు కారణంగా రామన్న మృతి చెందాడని, అతని అంత్యక్రియలు కూడా తెలంగాణా సరిహద్దుల్లో, బస్తర్ అడవుల్లోని బీజాపూర్ జిల్లా పామేడు-బాసగూడ ప్రాంతంలో జరిగినట్లు ఆయన వెల్లడించారు. ప్రముఖ ఆంగ్ల పత్రికలు సైతం సుందర్ రాజన్ ప్రకటనను ఉటంకిస్తూ బుధవారం వార్తా కథనాలను కూడా ప్రచురించాయి.

అయితే…గత శనివారం రామన్నమృతి చెందిన ఘటన వాస్తవమైతే మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎందుకు దాపరికంగా ఉంచిందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామన్న మావోయిస్టు పార్టీలో సాధారణ దళ నేత కూడా కాదు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలతో కూడుకున్న దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. ఇంత పెద్ద నాయకుడు అనారోగ్యంతో మరణిస్తే ఆ విషయాన్ని దాచి పెట్టాల్సిన అవసరం మావోయిస్టు పార్టీకి ఏమిటి? రామన్న చనిపోయినట్లు కొందరు పోలీసు అధికారులు ప్రకటించడం వెనుక గల ఆసక్తి ఏమిటి? వంటి అనేక ప్రశ్నలు విప్లవ కార్యకలాపాల పరిశీలకుల నుంచి వస్తున్నాయి.

సాధారణంగా పోలీసులతో భీకరంగా జరిగిన ఎన్కౌంటర్ ఘటనల్లో అగ్ర నేతలు చనిపోతే తీవ్రవాద గ్రూపులు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుతాయి. పోలీసులు సదరు నాయకుని మృత దేహాన్నిగుర్తించనంత వరకే ఈ దాపరికం సాగుతుంది. ఇటువంటి సందర్భాల్లో ముఖ్య నేతల మరణాన్ని విప్లవ పార్టీలు అధికారికంగా ప్రకటించకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. పార్టీకి చెందిన దిగువ స్థాయి నేతలు, కేడర్ ఆత్మస్థయిర్యం కోల్పోకుండా ఉండేందుకు ఈ తరహా దాపరికాన్ని పాటిస్తాయి. అయినప్పటికీ ఇది ఎంతో కాలం దాగదు. కాస్త ఆలస్యంగానైనా అసలు విషయం బయటకు పొక్కుతుంది.

ప్రస్తుత మావోయిస్టు, ఒకప్పటి పీపుల్స్ వార్ పార్టీకి అనుబంధ సంస్థగా కార్యకలాపాలు నిర్వహించిన సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) అంశంలో ఇదే తరహా దాపరికం పద్ధతిని పాటించేవారు. సికాస వ్యవస్థాపకుడు రమాకాంత్. అతనే తొలి కార్యదర్శి కూడా. అప్పటి పీపుల్స్ వార్ పార్టీ వద్ద ఏకే-47 ఆయుధాలు ఉన్నట్లు కూడా పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన రమాకాంత్ ఘటనలోనే బహిర్గతమైంది. సింగరేణి బొగ్గు గని కార్మిక వర్గాల్లో గట్టి ప్రాబల్యం గల సికాస కార్యదర్శి రమాకాంత్ ఎన్కౌంటర్ తర్వాత పీపుల్స్ వార్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రమాకాంత్ అనంతరం ఆయన స్థానంలో సికాస కార్యదర్శిగా వ్యవహరించిన మాదిరెడ్డి సమ్మిరెడ్డి, కట్ల మల్లేష్ తదితర నాయకులు అనేక మంది రమాకాంత్ పేరుతోనే పార్టీ పరంగా తమ బాధ్యతలు నిర్వహించేవారు. పలు ఎన్కౌంటర్లలో చనిపోయిన నాయకులు ‘రమాకాంత్’ గానే వెలుగులోకి వచ్చేవారు. దీంతో అప్పట్లో పోలీసులు తెగ కన్ఫ్యూజ్ అయ్యే వారు. అసలు చనిపోయింది రమాకాంత్ కాదా? అదే నిజమైతే ఇంకా ఎంత మంది రమాకాంత్ లు ఉన్నారు? వీళ్ల అసలు పేర్లు ఏమిటి? అనే విషయాల్లో దాదాపు పరిశోధన చేసినంత స్థాయిలో దర్యాప్తు జరిపేవారు. అనేక సంవత్సరాల తర్వాత, అంటే సికాస కార్యకలాపాలు పూర్తిస్థాయిలో తుడిచిపెట్టుకు పోయిన సమయంలోగాని పోలీసులకు అసలు విషయం అర్థం కాలేదు. రమాకాంత్ స్థానంలో పార్టీ ఎవరిని నియమించినా, అతని పేరు రమాకాంత్ గానే ఉండేదని, కార్యదర్శిగానే వ్యవహరించేవారని. పార్టీ కేడర్ డీలా పడకుండా సికాస సంస్థ  ఈ వ్యూహాన్ని అనుసరించిందనే విషయం అనేక మంది రమాకాంత్ ల ఎన్కౌంటర్ తర్వాత గాని బోధ పడలేదు.

ప్రస్తుతం రామన్న ఘటనలోనూ మావోయిస్టు పార్టీ బహుషా సికాస ఫార్ములాను అనుసరించే అవకాశాలను తోసిపుచ్చలేమని ఓ రిటైర్డ్ పోలీసు అధికారి అనుమానాన్ని వ్యక్తం చేశారు. రామన్న మరణాన్ని పార్టీ అధికారికంగా ధృవీకరిస్తే దండకారణ్యంలోని మావోయిస్టు కేడర్ డీలా పడే అవకాశం లేకపోలేదన్నారు. అందువల్లే రామన్న మృతి ఘటనపై మావోయిస్టుపార్టీ ఎటువంటి ప్రకటనజారీ చేసి ఉండక పోవచ్చని కూడా ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు.

కానీ ఈ తరహా వాదనను సికాస కార్యకలాపాలను నిశితంగా గమనించి వృత్తిపరంగా అనేక వార్తా కథనాలను అందించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ సీనియర్ జర్నలిస్టు తోసిపుచ్చారు. సహజ మరణాలకు సంబంధించి ఎంత పెద్ద నాయకుడు మరణించినా పార్టీ దాచిపెట్టే అవకాశాలు లేవన్నారు. ఒకప్పటి పీపుల్స్ వార్ రాష్ట్ర కమిటీ సభ్యుడు శంకర్ అనే అగ్రనేత పాముకాటుతో మరణిస్తే పార్టీ అధికారికంగా ప్రకటించిందని, నివాళులు కూడా అర్పించి, ప్రకటన కూడా జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. శంకర్ ఇంటికి సమాచారం ఇచ్చారని, కుటుంబ సభ్యులకు విషయం మొత్తం చెప్పారని, ఆయన మరణంపై విరసం సంస్థ పుస్తకం కూడా ప్రచురించినట్లు గుర్తున్నదని ఆ సీనియర్ జర్నలిస్టు పేర్కొన్నారు. రామన్న మరణిస్తే దాచి పెట్టాల్సిన అవసరం పార్టీకి ఉండకపోవచ్చని, ఆయన నిజంగానే చనిపోతే అధికారికంగా ప్రకటించడానికి కాస్త సమయం పట్టవచ్చన్నారు. మొత్తంగా రామన్న గుండెపోటుతో మరణించారనే ప్రచారం మాత్రం అయిదు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడం గమనార్హం.

Comments are closed.

Exit mobile version