అభినందించిన డీజీపీ మహేందర్ రెడ్డి

దేశంలోనే అత్యుత్తమ పది పోలీస్ స్టేషన్లలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఒకటిగా ఎంపికైంది. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పౌర సేవల విభాగంలో అత్యుత్తమ సేవలంచడం, పోలీస్ స్టేషన్ల మధ్య స్నేహపూర్వక పోటీతత్వాన్ని కల్పించే అంశాలపై దేశవ్యాప్తంగా పది అత్యుత్తమ పోలీస్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఏటా ఎంపిక చేస్తుంది. ఇందులో భాగంగానే 2020 సంవత్సరానికిగాను ఎంపిక చేసిన పది ఉత్తమ పోలీస్ స్టేషన్లలో కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ ను ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కాగా వరుసగా రెండోసారి కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలవడంపట్ల డీజీపీ మహేందర్ రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి, జమ్మికుంట స్టేషన్ హౌస్ అధికారితో పాటు ఈ ఘనతను సాధించిన ఇతర పోలీస్ అధికారులను అభినందించారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు దక్కిన ఈ పురస్కారం స్ఫూర్తిగా రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లు కూడా ఆదర్శంగా తీసుకుని ఉత్తమ పౌర సేవలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుకు పాటుపడాలని పిలుపు నిచ్చారు. ఇదిలా ఉండగా 2019 సంవత్సరంలో చొప్పదండి పోలీస్ స్టేషన్ 7 వ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Comments are closed.

Exit mobile version