రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవసాయ అనుకూల, రైతు సంక్షేమ విధానాలతో ధాన్యం దిగుబడులు అనూహ్యంగా పెరిగాయని, ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని, రైస్ మిల్లుల్లో మిల్లింగ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కొత్తగా రైస్ మిల్లులు, పారా బాయిల్డ్ మిల్లులను ఎక్కువ సంఖ్యలో స్థాపించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకోసం అత్యంత క్రియాశీలకంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్ లో రెండోరోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. ముందుగా వ్యవసాయశాఖ విషయాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో పురోగతి, పెరిగిన సాగు విస్తీర్ణం, అనూహ్యంగా పెరిగిన ధాన్యం దిగుబడి తదితర విషయాలను, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కార్యదర్శి, అధికారులు కేబినెట్ కు సమగ్రంగా వివరించారు. ప్రస్తుతం వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో, విత్తనాలు ఎరువుల లభ్యత, వర్షాపాతం తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది.

గత పాలనలో తెలంగాణలో వ్యవసాయం తీరు ఎట్లుండె.. నేటి స్వయం పాలనలో ఎట్లున్నది.. అనే విషయాలను సీఎం కెసిఆర్ కేబినెట్ సమావేశంలో చర్చించారు. గత ఏడేండ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, అది సాధించిన ఘన విజయాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించడంతోపాటు, అనేక కష్టాలకోర్చి సాగునీటి ప్రాజెక్టుల నిర్మించిన ప్రభుత్వం నదీ జలాలను చెరువులకు కుంటలకు, బీడు భూములకు మళ్లించిందన్నారు. దీంతో గ్రామాల్లో ఒక్క ఎకరమూ బీడుగా వదలకుండా, వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను రైతులు సాగు చేయడం ప్రారంభించారన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందన్నారు.

అదే సమయంలో ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతుబంధు పంట పెట్టుబడి సాయం సహా సకాలంలో ఎరువులను, విత్తనాలను అందుబాటులో ఉంచడం తదితర వ్యవసాయ, రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అన్నిరకాల ప్రోత్సాహక చర్యల ఫలితంగా, తెలంగాణలో గత సంవత్సరం రికార్డుస్థాయిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలో రైతులకు ఎటువంటి కష్టాలు రాకుండా, కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వమే గ్రామాల్లోకి వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు మరింత ఉత్సాహంతో వరి ధాన్యాన్ని పండించే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, వచ్చే సంవత్సరం ధాన్యం ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని కేసీఆర్ అన్నారు. అందుకు అనుగుణంగా ధాన్యం నిల్వ చేయడం, మార్కెటింగ్ చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రస్తుత వానాకాలం కోటీ నలభై లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు జరగనున్నదని, వరి పత్తి పంటలు రికార్డుస్థాయిలో పండనున్నాయని సిఎం తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని, రైస్ మిల్లుల్లో మిల్లింగ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా రైస్ మిల్లులు, పారా బాయిల్డ్ మిల్లులను ఎక్కువ సంఖ్యలో స్థాపించాలని కేసీఆర్ సూచించారు.ఇందుకోసం అత్యంత క్రియాశీలకంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.

రైతులకు సమగ్రంగా శిక్షణ ఇవ్వడానికి కావాలసిన అన్ని సౌకర్యాలను వ్యవసాయ శాఖ అధికారుల కల్పించాలని, ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని సిఎం స్పష్టం చేశారు. ఉద్యానవన శాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని అందుకు అవసరమైన రీతిలో అధికారులను నిపుణులను జోడించి నిరంతరంగా రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పౌర సరఫరాలశాఖ సహా వ్యవసాయశాఖలో ఇకపై ఎటువంటి ఉద్యోగాలు ఖాళీలు ఉండకూడదని, అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేబినెట్ ఆదేశించింది. పండిన ధాన్యాన్ని పండినట్టే ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మిల్లింగ్ చేసి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి సరఫరా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. అందుకు అవసరమైతే సంబంధిత రంగంలో నిపుణుల సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని కేబినెట్ సూచించింది. కొత్తగా ఏర్పాటుకు ముందుకు వచ్చే అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.

నూతన పరిశ్రమల ఏర్పాటుకు చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ :
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరగనున్నందున, ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రి గంగుల కమలాకర్, హరీశ్ రావు, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, జి.జగదీశ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.

Comments are closed.

Exit mobile version