గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇదే దశలో ఓటర్ల ‘బుర్ర’కు పనిచెప్పే విధంగానూ నాయకులు కొన్ని ఎలక్షన్ డైలాగ్స్ విసురుతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి వేరు.
![ts29 ktr2 compressed](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/11/ktr2-compressed.jpg?resize=788%2C588&ssl=1)
కానీ, ఇదే సమయంలో వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు చెబుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిన్న ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారో ఓసారి జాగ్రత్తగా పరిశీలించండి, ‘మజ్లిస్ తో టీఆర్ఎస్ పార్టీకి పొత్తు లేదు. ఎంఐఎం మాకు మిత్రపక్షం కాదు’ అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఎంఐఎంను ఓడిస్తామని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా ప్రకటించడం గమనార్హం.
ఇక నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ ఏమంటున్నారో తెలుసా? ‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎక్కడా పోటీలో లేదు. అసలు పోటీ బీజేపీ, మజ్లిస్ పార్టీల మధ్యే’ అని పేర్కొన్నారు.
![ts29 arvind](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/11/arvind.jpg?resize=325%2C378&ssl=1)
మరి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి ఏమంటున్నారు? బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ ఒకే ఎజెండాతో పనిచేస్తున్నాయని, ఆ మూడు పార్టీలూ ఒకటేనని రేవంత్ రెడ్డి చెబుతున్న నిర్వచనం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ… ఇద్దరూ ఒకటేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను కాపాడుతున్నది బీజేపీయేనని కూడా రేవంత్ ఆరోపించారు.
![ts29 revanth](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/11/revanth.jpg?resize=517%2C519&ssl=1)
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయ్ కదూ! జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ తేదీ వరకు… అంటే డిసెంబర్ 1వ తేదీ వరకు ఇంకా ఇటువంటి కామెంట్స్ ఎన్ని వినాల్సి ఉంటుందో…!! అదీ అసలు సంగతి.