ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రముఖ కాంగ్రెస నేత కుటుంబానికి వియ్యంకుడు కాబోతున్నారు. రెండేళ్ల క్రితం తన కుమారుని వివాహం చేసిన పొంగులేటి త్వరలోనే తన ఇంట మరో శుభకార్యం నిర్వహించబోతున్నారు. పొలిటికల్ గానే కాక, పారిశ్రామికంగానూ క్లీన్ ఇమేజ్ గల ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత కుటుంబంలోకి తన కుమార్తెను కోడలిగా పంపనున్నారు. ఈ విషయం తెలిసిన పొంగులేటి అభిమానులు మహా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ పొంగులేటి వియ్యం అందుకోబోతున్న ఆయా క్లీన్ ఇమేజ్ గల రాజకీయ కుటుంబం ఎవరిదో తెలుసా? వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డిది. ఆయన మనవడికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కూతురును ఇచ్చి వివాహం జరిపించబోతున్నారు.

రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్న వ్యక్తికైనా రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబ నేపథ్యం తెలుసు. ఒకప్పుడు ఖమ్మం జిల్లాకే చెందిన రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నేత. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో ఆయనకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యునిగా, మరో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు మరపురాని సేవలు అందించారు. ఓసారి ఎంపీగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. సురేందర్ రెడ్డి 1967-71, 1989-91,1991-96లలో వరంగల్ పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. అంతకు ముందు ఆయన 1978-83, 1983-85, 1985-89 సంవత్సరాల్లో డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన రాజకీయ జీవితంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. రాజకీయ నేతగానే కాదు హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మెన్ గా, ప్రముఖ పారిశ్రామికవేత్తగా సురేందర్ రెడ్డి పేరు, ప్రఖ్యాతులున్నాయి.

వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి

అయితే 1996 నుంచి రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటున్న సురేందర్ రెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్ నాయకుడే కావడం విశేషం. పదవులకోసమో, రాజకీయ ఆధిపత్యం కోసమో పార్టీలు మారే అలవాటు ఆయనకు లేకపోవడం గమనార్హం. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యధినేత అయినప్పటికీ ‘లో ప్రొఫైల్’గా ఉండడమే సురేందర్ రెడ్డి కుటుంబానికి గల ప్రత్యేకత. సురేందర్ రెడ్డి కుమారుడే రఘురాంరెడ్డి.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డిని రంగంలోకి దింపేందుకు పార్టీకి చెందిన పలువురు నేతలు ప్రయత్నించారు. అయితే రఘురాంరెడ్డి వారి ప్రయత్నాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డికి రఘురాంరెడ్డి అత్యంత సన్నిహితుడు. రఘురాంరెడ్డి పెద్ద కుమారునికి సినీ హీరో వెంకటేష్ కూతురును ఇచ్చి పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. ఈయన రెండో కుమారునికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించబోతున్నారు.

రామసహాయం రఘురాం రెడ్డి

అటు రాజకీయంగా ‘క్లీన్ ఇమేజ్’, ఇటు పారిశ్రామికంగా భారీ పేరు ప్రఖ్యాతులు గల రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబంతో తమ నాయకుడు వియ్యం అందుతుండడం పట్ల పొంగులేటి అభిమానులు పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది నెలల్లోనే ఈ శుభకార్యం జరగనుందని, వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని పొంగులేటి అభిమానులు చెబుతున్నారు.

Comments are closed.

Exit mobile version