వరంగల్ మహానగరంలో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ లోని సెంట్రల్ జైల్ లో గల జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా వెడుతున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను మడికొండ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల, పోలీసుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. తమ వాహనాలను దిగి కొంత దూరం కాంగ్రెస్ నేతలు నడిచారు. అనంతరం కారు ఎక్కి వరంగల్‌ వెళ్లారు. ఈ పరిణామాల్లోనే రహదారిపై వాహనాలు అడ్డుగా పెట్టి కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరసనకు దిగారు. ఫలితంగా వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ జైల్ వద్దకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు జంగా రాఘవరెడ్డిని ఫోన్ ద్వారా పరామార్శించారు.

జంగా రాఘవరెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు బనాయించారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. పోలీసులు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కులం పేరుతో పోలీసులు దుర్భాషలాడారని, వారిపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. దోపిడీ దొంగల్లా టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుంటూ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్​కు, మంత్రి ఎర్రబెల్లికి సమయం దగ్గరపడిందని, వారి పతనం ఖాయమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అభివృద్ధిని విస్మరించిన టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. బేషరతుగా జంగా రాఘవరెడ్డిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.

Comments are closed.

Exit mobile version