మందుబాబుల పాలిట మళ్లీ దుర్వార్త. కరోనా పుణ్యమా అని ఇన్నాళ్లపాటు ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీల నుంచి పలువురు మద్యపాన ప్రియులకు కాస్త వెసులుబాటు లభించినట్లయింది. కానీ ఇక మందుబాబుల ఆటలు చెల్లవు. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, క్లబ్బులు తెరిచేందుకు ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నిర్వహణకు సమాయత్తమవుతున్నారు. కరోనా కల్లోల పరిణామాల్లో ఇటువంటి తనిఖీలు ఎప్పుడో మానేశారుగా… అంటారా? ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా కరీంనగర్ పోలీసులు టాంటాం చేసి మరీ చెబుతున్నారు. కావాలంటే దిగువన గల ఆయా ప్రకటనను ఓసారి పూర్తిగా చదవండి.
వాహనదారులకు విజ్ఞప్తి:
గత 6 నెలల నుండి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో వాహనాల తనిఖీ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ లను నిలిపి వేయడమైనది. గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్, కరీంనగర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుండి కమిషనరేట్ పరిధిలో వాహనాల తనిఖీ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. కావున వాహనదారులు మద్యం త్రాగిన తర్వాత వాహనాలు నడపద్దు. ఒకవేళ ఎవరైనా మద్యం త్రాగిన తర్వాత వాహనాలు నడిపితే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడును.
ఇట్లు
T. లక్ష్మి బాబు, ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్,
కరీంనగర్ II టౌన్