సాయుధ విప్లవోద్యమ చరిత్రలో ఇదో సరికొత్త, సంచలన ఘటన. పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో చేస్తున్న ఆదివాసీల హత్యలకు సంబంధించి మావోయిస్టు నక్సల్ దళాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని, వివాదం ముదిరి సహచర నక్సలైట్లు విజ్జా మొడియం అలియాస్ భద్రు అనే కమాండర్ స్థాయి నాయకుడు, డివిజనల్ కమిటీ మెంబర్ ను కాల్చి చంపారని బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ నిన్న ప్రకటించారు. ఇదే గనుక నిజమైతే మావోయిస్టు పార్టీలో ఇదో కీలక పరిణామంగానే అంచనా వేయవచ్చు. ఈ సంచలన ఘటన లోతుల్లోకి వెళ్లేముందు కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి కూడా వెళ్లాల్సిందే… అదేమిటంటే..?
కత్తుల సమ్మయ్య గురించి విన్నాం. సోమ్లా నాయక్ ఘటన తెలిసిందే. జడల నాగరాజు కాల్పుల ఉదంతం విదితమే. గ్యాంగ్ స్టర్ నయీం కథ ముగిసిన ముచ్చట. అప్పటి పీపుల్స్ వార్ ప్రస్తుత మావోయిస్టు పార్టీకి తీరని నష్టాన్ని కలిగించిన ఆయా వ్యక్తులను పోలీసు శాఖ పూర్తి స్థాయిలో వినియోగించుకుందనే ప్రచారం ఇప్పటికీ ఉండనే ఉంది. కత్తుల సమ్మయ్య హుజూరాబాద్ సాయుధ దళాన్ని, సోమ్లా నాయక్ నల్లగొండ జిల్లా నాయకత్వాన్ని, జడల నాగరాజు ఏకంగా విజయ్ అనే పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శినే కాల్చి చంపిన ఘటనలు 1990వ దశకంలో తీవ్ర సంచలనం కలిగించాయి.
ఆయా ముగ్గురు వ్యక్తులూ అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో సాయుధ నక్సలైట్లే. ‘కోవర్ట్’ ఆపరేషన్ల ఫలితంగా సహచర నక్సలైట్లను, నాయకులను కాల్చి చంపిన ఘటనల అనంతరం ఆయా వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారు. పీపుల్స్ వార్ ఉద్యమ చరిత్రలో నయీమ్ గురించి కొత్తగా చెప్పకునేది కూడా ఏమీ లేదు. కొయ్యూరు ఎన్కౌంటర్ ఘటనలో నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అనే ముగ్గురు అగ్రనేతల మరణానికి పార్టీకి చెందిన ఓ వ్యక్తే ప్రధాన కారకుడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఆయా ఉదంతాలు పీపుల్స్ వార్ దళాల్లోనే కాదు, అగ్రనాయకత్వంలోనూ భారీ అభద్రతా భావాన్ని కలిగించాయి. ఎవరు కోవర్టులో, మరెవరు సహచరులో తెలియని అయోమయ స్థితిని పీపుల్స్ వార్ పార్టీ ఎదుర్కుంది.
అదేవిధంగా నక్సల్ గ్రూపుల మధ్య వర్గపోరాటానికి దారిస ఘటనలు కూడా అనేకం. పీపుల్స్ వార్, జనశక్తి నక్సల్స్ మధ్య కాల్పులు, చండ్రపుల్లారెడ్డి గ్రూపునకు చెందిన ఫణిబాగ్చి-రామచంద్రన్, ప్రతిఘటన-ప్రజా ప్రతిఘటన, న్యూడెమోక్రసీ-ప్రతిఘటన గ్రూపుల మధ్య పరస్పర కాల్పులు, నష్టాలు జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఆధిపత్య, వర్గపోరులో భాగంగా సిరిసిల్ల, ములుగు, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో దశాబ్ధాల క్రితం ఆయా తీవ్రవాద గ్రూపుల మధ్య కాల్పులకు దారి తీసిన సాయుధ ఘర్షణ ఘటనలు అనేకం. ఒక్కోసారి అడవుల్లో పరస్పరం ఎదురుపడిన సందర్భంగా పోలీసులుగా పొరబడి ఒకే పార్టీకి చెందిన సాయుధ నక్సల్ దళాల మధ్య కాల్పులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి.
![ts29 vijja compressed](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/10/vijja-compressed.jpg?resize=758%2C834&ssl=1)
తాజాగా జరిగినట్లు పేర్కొంటున్న ఘటనపై బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం… ఇన్ఫార్మర్ హత్యల విషయంలో ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా గంగళూరు ఏరియా కమిటీకి, డీవీసీ విజ్జా మొడియం అలియస్ భద్రు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మావోయిస్టు పార్టీకి చెందిన రెండు సమూహాల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఫలితంగా సహచర నక్సలైట్లే విజ్జా మొడియాన్ని కాల్చి చంపారు. అనంతరం అతని డెడ్ బాడీని సొంత బంధువులకు అప్పగించగా, సొంత గ్రామమైన మాంకెలిలో దహనం చేశారు. ఇదీ విజ్జా మొడియం అనే కమాండర్ స్థాయి నక్సల్ నేత హత్యకు సంబంధించి బస్తర్ ఐజీ అధికారికంగా ప్రకటించిన సమాచారం.
పోలీసు ఉన్నతాధికారి ప్రకటన సంగతి ఎలా ఉన్నప్పటికీ, వాస్తవిక పరిస్థితుల్లో ఇదే కారణాలతో విజ్జాను సహచర నక్సల్స్ కాల్చి చంపితే మాత్రం దశాబ్ధాల మావోయిస్టు పార్టీ విప్లవోద్యమ చరిత్రలో ఇదో సరికొత్త సంఘటనగానే అభివర్ణించక తప్పదు. ఎందుకంటే తీవ్రవాద గ్రూపుల్లో పొరపాట్లు చేసిన అనేక మంది నాయకుల విషయంలో పార్టీ నాయకత్వం అనుసరించిన విధానాలు వేరు. విజ్జా విషయంలో జరిగినట్లు పేర్కొంటున్న ఘటన కథనం వేరు. ఇన్ఫార్మర్ల పేరుతో అమాయక ఆదివాసీలను హత్య చేయడం, మరిన్ని హత్యలకు విజ్జా ఆదేశించడం నిజమే అయితే, ఆ విషయం పార్టీ అధినాయకత్వం దృష్టికి వెడితే జరిగే పరిణామాలు వేరని విప్లవ కార్యకలాపాల పరిశీలకులు చెబుతున్నారు.
వారి కథనం ప్రకారం… సహజంగా ఇటువంటి అంశాలపై పార్టీలో లోతైన చర్చ జరుగుతుంది. సంబంధిత వ్యక్తులను ప్రశ్నిస్తారు. నిలదీస్తారు. ఏకపక్ష నిర్ణయాలను, ఒంటెద్దు పోకడలపై విశ్లేషణ చేస్తారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తారు. అవసరమైతే ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులు వాడుతున్న ఆయుధాన్ని తీసుకుని నిరాయుధున్ని చేస్తారు. దళనేత నుంచి సాధారణ సభ్యునిగా డీ ప్రమోట్ చేస్తారు. పనిష్మెంట్ సరిపోదనుకుంటే పార్టీ నుంచి కొంతకాలం సస్పెండ్ చేస్తారు. అనివార్యమైతే చివరగా పార్టీ నుంచి బహిష్కరిస్తారు కూడా. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య నాయకత్వ విధానాలను విభేదించిన సమయంలోనూ పార్టీలో తీవ్ర చర్చ జరిగిందనే వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల్లో కొండపల్లిని నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించి, అతని స్థానంలో గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు.
కొండపల్లి-గణపతిల ఘటనతో విజ్జా మొడియం ఉదంతాన్ని పోల్చడమేంటి? అనే ప్రశ్న ఉద్భవించినపుడు… పార్టీలో దుందుడుకు, ఏకపక్ష పోకడలను అవలంభించే అంశంపై సాధారణ దళసభ్యుని నుంచి కేంద్ర కమిటీ కార్యదర్శి వరకు అనుసరించే ఆత్మపరిశీలన, జరిగే చర్చా విధానం ఒకేరకంగా ఉంటుందని విప్లవ కార్యకలాపాల పరిశీలకులు చెబుతుంటారు. అయితే విజ్జా కూడా సాధారణ దళ సభ్యుడేమీ కాకపోవడమే ఇక్కడ గమనించాల్సిన అంశం. పదిహేనేళ్లుగా పార్టీలో కొనసాగుతూ, డివిజనల్ కమిటీ సభ్యుని స్థాయి వరకు ఎదిగాడంటే, పార్టీ విధానాలు తెలియకుండా ఉంటాడా? అనే సందేహాన్ని విప్లవ కార్యకలాపాల పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో విజ్జా విషయంలో అసలేం జరిగి ఉంటుందనే ప్రశ్న కూడా ఉద్భవిస్తోంది. ఒక్కోసారి అసాధారణ పరిణామాల్లోనూ ఈ తరహా ఘటన జరిగే అవకాశాలను విప్లవ నేపథ్యం గల మాజీ నక్సల్ వర్గాలు తోసిపుచ్చలేకపోతున్నాయి. విజ్జా స్వయంగా ఏదేని ‘కోవర్ట్’ కార్యకలాపాలకు పాల్పడి ఉంటాడా? లేదంటే తనే పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నట్లు సహచర నక్సల్స్ పసిగట్టాయా? ఈ పరిణామాల్లో పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు ధృవీకరించుకున్న తర్వాతే సహచర నక్సల్స్ విజ్జాపై తుపాకీ ఎక్కుపెట్టారా? ఇవన్నీ మరో కోణంలో తలెత్తే సందేహాలుగా విప్లవ కార్యకలాపాల పరిశీలకులు చెబుతున్నారు. ఓ కమాండర్ స్థాయి నాయకున్ని సహచరులే ఇలా కాల్చి చంపే ఆస్కారమే లేదని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న అలియాస్ జీనుగ నరసింహారెడ్డి ts29 ప్రశ్నించిన సందర్భంగా చెప్పారు..
ఈ నేపథ్యంలో కమాండర్ విజ్జాను నిజంగానే సహచర నక్సల్స్ కాల్చి చంపారా? బస్తర్ ఐజీ ధృవీకరించిన ఘటనపై మావోయిస్టు పార్టీ ఎలా స్పందిస్తుంది. ఇందుకు సంబందించి ఏదైనా ప్రకటన చేస్తుందా? అనే ప్రశ్నలకు జవాబు కోసం వేచి చూడాల్సిందే.