ఛత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ కీలక ప్రకటన చేశారు. సరిహద్దు అటవీ ప్రాంతంలో నక్సల్స్ దళాల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నామని, వివిధ వర్గాలకు చెందినవారు మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు సహకరించేందుకు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోకి వెళ్లవద్దన్నారు.
గత రెండు నెలల కాలంలో మావోయిస్టులు సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో 25 మంది అమాయక ఆదివాసీ ప్రజలను పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో పొట్టన పెట్టుకున్నారని ఎస్పీ అన్నారు. అదేవిధంగా తెలంగాణ సరిహద్దు కలిగి ఉన్న జిల్లాల్లో కూడా మావోయిస్టులు గత పదిహేను రోజులలో ఇద్దరూ అమాయక ప్రజలను చంపేశారన్నారు.
ప్రజలతో వారి అవసరాలు తీరిన తర్వాత వారినే పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో అనుమానిస్తూ చిత్రహింసలకు గురి చేసి చంపుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అందువల్ల ప్రజలెవరు కూడా మావోయిస్టులకు సహకరించడానికి ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోనికి వెళ్ళరాదన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు గస్తీ దళాలతో అటవీ ప్రాంతమంతా కూంబింగ్ నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా ఎవరైనా పట్టుబడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం ప్రాంతాలలో కూడా పోలీసు నిఘాను పెంచామని, కాబట్టి ప్రజలు ఎవరూ కూడా మావోయిస్టులకు సహకరించడానికి ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోనికి వెళ్ళరాదన్నారు. అలాగే ఆర్ఎంపీ డాక్టర్లు గానీ, వ్యాపారులు గానీ మావోయిస్టు పార్టీకి సహకరించి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎస్పీ సునీల్ దత్ పేర్కొన్నారు.