రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు అడ్వకేట్ గట్టు వామన్ రావు దంపతుల హత్యపై పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను నోరు విప్పాడు. అడ్వకేట్ దంపతుల పాశవిక హత్యలో బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకుని నాలుగు రోజులుగా విచారించి సోమవారం అరెస్ట్ చేసినట్లు నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి ప్రకటించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్, ఈ ఘటనలో కారు, రెండు కత్తులను అందజేసిన నాలుగో నిందితుడు బిట్టు శ్రీను ఇచ్చిన వాంగ్మూలాలను విశ్లేషించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఐజీ ప్రకటించారు. బిట్టు శ్రీను వాంగ్మూలం ప్రకారం… అంటూ ఐజీ వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిట్టు శ్రీను 2016 నుండి మంథనిలో నడుస్తున్న పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా కొనసాగుతున్నాడు. మంథని ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ ట్రస్టుపై మృతుడు గట్టు వామన్ రావు పలు ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో చులకన చేస్తూ, పలు వాట్సాప్ గ్రూపు లో సందేశాలు పంపించేవాడు. బిట్టు శీనుపై అవమానకరంగా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడని ప్రచారం చేసేవాడు. ట్రస్టు, దాని ఆదాయాలపై హైదరాబాద్, ఇతర చోట్ల గట్టు వామన్ రావు తన అనుచరులతో ఫిర్యాదులు చేయించాడు. 2015 నుండి 2019 ఏప్రిల్ వరకు మంథని గ్రామపంచాయతీలో బిట్టు శ్రీను చెత్త రవాణా కొరకు ఒక ట్రాక్టర్ పెట్టగా, దానిపై బిట్టు శ్రీనుకు నెలకు 30 వేల రూపాయలు ఆదాయం వచ్చేది. 2019 మార్చిలో గ్రామ పంచాయతీలోని అధికారికి బిట్టు శ్రీను ట్రాక్టర్ పై ఫిర్యాదు చేసి దానిని తీసి వేయాలని పంచాయతీ అధికారిపై గట్టు వామన్ రావు ఒత్తిడి తీసుకువచ్చాడు. దాంతో ఆ అధికారి ట్రాక్టర్ ని గ్రామపంచాయతీ నుండి తొలగించాడు. ట్రాక్టర్ పై వచ్చే నెల వారి 30 వేల ఆదాయం బిట్టు శ్రీను కోల్పోయాడు. ఇట్టి విషయాన్ని తాను బిట్టు శ్రీనుపై సాధించిన విజయంగా మంథని ప్రాంతంలో, సోషల్ మీడియాలో వామన్ రావు ప్రచారం చేశాడు. ఈ నేపథ్యంలోనే మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీను, బిట్టు శ్రీనుల మధ్య గత ఆరు సంవత్సరాలుగా పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారారు. రెగ్యులర్ గా కలిసి ఉండేవారు. వీరికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు మందు తాగే సమయంలో పంచుకునేవారు. వీళ్ళతో అప్పుడప్పుడు చిరంజీవికూడా కలిసే వాడు.

ఈ క్రమంలో కుంట శ్రీనివాస్ గుంజపడుగు గ్రామస్తుడైన గట్టు వామన్ రావు పీవీ నాగమణి దంపతులు కొన్ని సంవత్సరాలుగా కుంట శ్రీనివాస్ ను టార్గెట్ చేసుకుని ఒక ఫోన్ కాల్ విషయంలో హైదరాబాదులో అతనిపై కేసు పెట్టించారు. కుంట శ్రీను వాళ్ళ కులదైవం పెద్దమ్మ తల్లి గుడి నిర్మించేందుకు తానే చైర్మన్ గా నిర్మాణ పనులు సాగిస్తున్న క్రమంలో, అది అక్రమ నిర్మాణమని ఫిర్యాదు చేసి నోటీసులు ఇప్పించిన వామన్ రావు దంపతులు గుడి నిర్మాణాన్ని నిలువరించారు. కుంట శీను ఇంటి నిర్మాణం చేస్తుండగా పనులు మధ్యలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోలేదని అక్రమ నిర్మాణం చేస్తున్నాడని కూడా వామన్ రావు అడ్డుకున్నారు. ఇందులో భాగంగానే నిర్మాణం నిలుపుదల చేస్తూ గ్రామపంచాయతీ నుండి నోటీసు ఇచ్చి నోటీసును ఫ్లెక్సీ తయారు చేయించి. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో గట్టు వామన్ రావు ప్రచారం చేయడం చేశారు. గుంజపడుగులో రామ స్వామి గోపాలస్వామి ఆలయానికి సంబంధించిన కమిటీ చైర్మెన్ గా చాలా సంవత్సరాల నుండి వామన్ రావు తమ్ముడు చైర్మన్ గా ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడని, ఈ మధ్యకాలంలో గుంజపడుగు గ్రామస్తులు అందరూ కలిసి పాత కమిటీ రద్దు చేసి కొత్త కమిటీ చైర్మన్ గా వెల్ది వసంతరావు ను ఎన్నుకున్నారు. ఈ విషయంలో కూడా గట్టు వామన్ రావు, నాగమణి, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తూ హైకోర్టులో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో గొడవ జరిగింది. ఆ విధంగా కుంట శ్రీను గ్రామంలో తన అధిపత్యానికి వామన్ రావు నాగమణి లు అడ్డువస్తున్నారని భావించాడు.

దానికి బిట్టు శీను కూడా కుంట శ్రీనుతో తనకి కూడా ఆదాయ మార్గాలు రాకుండా చేసి ప్రజలలో అవమాన పరిచాడని బిట్లు శ్రీను కూడా కుంట శ్రీనుతో చెప్పాడు. వ్యక్తిగతంగా తనకు తీవ్ర నష్టం చేశాడని గట్టు వామన్ రావుని చంపే విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని కుంట శ్రీనుతో చెప్పాడు. నాలుగు నెలల క్రితం వామన్ రావు గురించి చర్చించే సమయంలో కుంట శ్రీను రెండు కత్తులు తయారు చేయించి పెట్టు అన్నా… అని బిట్టు శ్రీనుకి చెప్పగా అతను రెండు ట్రాక్టర్ పట్టీలు తీసుకొని మంథనిలో కత్తులు తయారు చేయించి చిరంజీవి ఇంట్లో పెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లో మనం వామన్ రావు ని చంపకపోతే భవిష్యత్తులో ఎప్పుడూ ఇబ్బంది ఉంటుందని గత పది నెలల నుంచి చాలా సందర్భాల్లో కుంట శీను బిట్టు శ్రీనుకు చెప్పాడు.

ఈ నేపథ్యంలోనే దాదాపు నాలుగు నెలల క్రితం వామన్ రావు 15 మందితో మూడు కార్లలో మంథని కోర్టుకు రాగా, చిరంజీవి వారిని చూసి బిట్టు శ్రీనుకు చెప్పగా, వెంటనే ఈ విషయం కుంట శ్రీనుకి బిట్టు శ్రీను తెలిపాడు. కుంట శ్రీను మంథనికి వచ్చేలోపే వామన్ రావు మూడు కార్లలో గుంజపడుగు వచ్చాడు. అప్పుడు కుంట శ్రీను వామన్ రావు గురించి గుంజపడుగు బస్ స్టాపులో వెయిట్ చేశాడు. తన ఇంటికి తనతో పాటు వచ్చిన ఒక వ్యక్తికి వామన్ రావు సన్మానం చేస్తుండగా, కుంట శ్రీను వామన్ రావు ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి పాత స్కూల్ బిల్డింగ్ నుంచి చూశాడు. అయితే ఎక్కువ మంది ఉన్నారని, ఇప్పుడు వీలు కాదని చెప్పగా వామన్ రావును హత్య చేసే ప్లాన్ ను ఆ సందర్భంగా విరమించుకున్నారు.

తమ హత్యా పథకంలో వామన్ రావు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా? అని ఎదురుచూస్తున్న క్రమంలో ఈనెల 17వ తేదీన మధ్యాహ్నం సమయంలో మంథని కోర్టుకు గట్టు వామన్ రావు దంపతులు వచ్చారని తెలిసి కుంట శ్రీను బిట్టు శ్రీనుకి ఫోన్ ద్వారా తెలుపగా, ఖచ్చితంగా నిర్ధారణ చేసుకో… అని అతను చెప్పగా, కోర్టు దగ్గరలో ఉన్న కుంట లచ్చయ్యకి ఫోన్ చేసి వామన్ రావు అక్కడ ఉన్నది నిజమేనని నిర్ధారణ చేసుకుని బిట్లు శ్రీనుకు మళ్లీ విషయాన్ని చెప్పాడు. వెంటనే బిట్టు శ్రీను శివనందుల చిరంజీవికి ఫోన్ చేసి నీ దగ్గర ఉన్న కత్తులు తీసుకొని అర్జెంటుగా మంథని బస్ స్టాప్ దగ్గరికి రమ్మని చెప్పాడు. చిరంజీవి టూ వీలర్ పై కత్తులు తీసుకొని రాగా, బిట్టు శ్రీను తన కారును చిరంజీవికి ఇవ్వగా, కత్తులు కారులో పెట్టుకుని కుంట శ్రీను వద్దకు వెళ్లాడు. కల్వచర్ల సమీపంలో వామన్ రావును, అతని భార్య నాగమణిని చంపామని కుంట శ్రీను బిట్టు శ్రీనుకి ఫోన్లో తెలపగా, మంచిది… మీరు మహారాష్ట్రకు వెళ్లిపొండని చెప్పిన బిట్టు శ్రీను తన ఇంటి వద్ద ఏమీ తెలియనట్టు ఉన్నాడు.

ఈ హత్యోదంతంలో చిరంజీవి వినియోగించిన మోటార్ సైకిల్ ను, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ నాగిరెడ్డి వివరించారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతూ ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సి న అవసరం ఉందన్నారు. ఇంకా కొంతమంది సాక్ష్యులను కూడా విచారించి వారి వాంగ్మూలం నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకుని పూర్తిస్థాయి విచారణ జరిపి వారు ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను పూర్తి స్థాయిలో నిర్ధారించాల్సి ఉందని కూడా చెప్పారు. ఇందుకోసం హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులను, సైబర్ క్రైమ్ పరిశోధకులను విచారణ సహాయకులుగా తీసుకుని ముందుకు సాగనున్నట్లు ఐజీ నాగారెడ్డి స్పష్టం చేశారు.

Comments are closed.

Exit mobile version