ఆనందయ్య మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు వైఎస్ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు తాను తయారు చేస్తున్న మందును ఆనందయ్య ఇవ్వవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆనందయ్య ఇ‍చ్చే పీ, ఎల్‌, ఎఫ్‌ మందులను రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం పేర్కొంది. అయితే కంట్లో వేసే ‘కే’ రకం మందుకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కే రకం మందుకు సంబంధించి విచారణ నివేదిక ఇంకా రాని కారణంగా ఈ మందుకు అనుమతి ఇచ్చేందుకు ప్రస్తుతానికి ప్రభుత్వం నిరాకరించింది. కంట్లో వేసే చుక్కల మందుకు సంబంధించి నివేదిక రావడానికి మరో రెండు నుంచి మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ నివేదిక పరీశీలించిన అనంతరం కే రకం మందుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

ఆనందయ్య మందులను వాడే కరోనా రోగులకు ప్రభుత్వం ఈ సందర్బంగా కొన్ని సూచనలు కూడా చేసింది. కరోనాకు డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే, రోగుల వ్యక్తిగత విచక్షణ మేరకు ఆనందయ్య మందును వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆనందయ్య మందులు వాడుతున్నామనే కారణంతో మిగిలిన మందులు ఆపవద్దని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ఇదే దశలో అనందయ్య ఇస్తున్న మందు వాడితే కరోనా తగ్గుతుందనేందుకు కచ్చితమైన ఆధారాలు ఏవీ లేవని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు ఆనందయ్య మందుల వల్ల హాని కూడా లేదని తేలినట్లు ప్రభుత్వం వివరించింది. కాగా ఆనందయ్య మందును తీసుకునేందుకు కరోనా సోకిన వారు కృష్ణపట్నం రావద్దని ప్రభుత్వం సూచించింది. రోగుల తరపున వారి కుటుంబ సభ్యులు వచ్చి మందును తీసుకెళ్లాలని సూచించింది. తద్వారా కరోనా వ్యాప్తిని నివారించవచ్చని, ఆనందయ్య మందు పంపిణీలో కరోనా నిబంధనలు పాటించాలని కూడా పేర్కొంది.

Comments are closed.

Exit mobile version