మహిళా ట్రైనీ ఎస్ఐ పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి స్పందించారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలో మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలు రుజువైతే ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

మహబూబాబాద్ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు అధికారిని సదరు పోలీస్ స్టేషన్ ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళా ట్రైనీ ఎస్సై మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషికి ఫిర్యాదు కూడా చేశారు.

ఈ ఫిర్యాదుపై వరంగల్ పోలీస్ కమిషనర్ తక్షణమే స్పందిస్తూ, జరిగిన సంఘటనపై వాస్తవాలు ఏమిటనేది విచారణ జరపనున్నట్లు చెప్పారు. మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా రుజువైతే ఎస్ఐ పి. శ్రీనివాస్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Comments are closed.

Exit mobile version