టీఆర్ఎస్ ప్లీనరీలో ఇదో సంచలన ఘటన. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు ఒకరు ప్లీనరీలో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలానికి దారి తీసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కొద్ది రోజుల క్రితం హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన మున్నూరు రవి అధికార పార్టీ ప్లీనరీలో ప్రత్యక్షం కావడమే అసలు విశేషం.

ఈ సందర్భంగా మున్నూరు రవి టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులతో ఫొటోలు కూడా దిగాడు. పార్టీ ప్లీనరీకి ఆహ్వానం గల నాయకులకు హై సెక్యూరిటీ, బార్ కోడ్ పాసులు జారీ చేశారు. ఆయా పాసులు ఉన్నవారిని మాత్రమే ప్లీనరీ జరిగే ప్రాంతంలోకి అనుమతించారు.

కానీ ఈ తరహా పాస్ లేకున్నా మంత్రిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన మున్నూరు రవి ప్లీనరీకి ఎలా హాజరయ్యాడనే విషయం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ప్లీనరీలో సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేస్తున్న సమయంలోనూ మున్నూరు రవి అక్కడే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఫొటో: మున్నూరు రవి (ఫైల్)

Comments are closed.

Exit mobile version