హైదరాబాద్ మహానగర మొదటి మహిళా మేయర్ ఎవరో తెలుసా? రాణీ కుముదినీ దేవి. వరంగల్ జిల్లా హన్మకొండలోని వడ్డెపల్లిలో జనవరి 23, 1911న ఆమె జన్మించారు. రాణీ కుముదినీ దేవి తండ్రి పింగళి వెంకటరామారెడ్డి నైజాం రాష్ట్రానికి ఉప ప్రధానమంత్రిగా పని చేశారు.హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన తరువాత వెంకటరామారెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కుముదినీ దేవి వనపర్తి సంస్థానానికి చెందిన జనుంపల్లి రాజారాందేవ్ రావును పెళ్లి చేసుకున్నారు.
కుముదినీ దేవి నిజాం రాష్ట్రంలో వాహనం నడిపిన మొదటి మహిళగా, హైదరాబాద్ తొలి మహిళా మేయర్ గా (1962లో) ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. కుముదినీ దేవి 1962 నుంచి 1972 వరకు వనపర్తి శాసనసభ స్థానానికి ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహించారు. కుముదినీ దేవి కుష్టు వ్యాధిగ్రస్థుల కోసం శివానంద పునరావాస కేంద్రం అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మంది రోగులను ఆదుకున్నారు. రాణీ కుముదినీ దేవి తన 98 యేట, ఆగస్టు 6, 2009న కన్నుమూశారు.
రాణీ కుముదినీ దేవి తర్వాత సరోజనీ పుల్లారెడ్డి, బండ కార్తీకరెడ్డిలు హైదరాబాద్ మేయర్లుగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో కూడా జీహెచ్ఎంసీ మేయర్ పదవిని జనరల్ మహిళకు రిజర్వు చేశారు.