తెలంగాణాలో అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు కొద్దిసేపటి క్రితం రాసిన లేఖ ఇది. ఈ లేఖలో కేటీఆర్ ఏమంటున్నారంటే… విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణా రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నదని. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా కుట్ర చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని కేటీఆర్ ఆయా లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తన లేఖలో కోరారు.
అంతకు ముందు ఆయన తెలంగాణా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు బీజేపీ ఆఫీస్ ముందు జరిగిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం ఘటన ఆధారంగా రేపు నగరంలో బీజేపీ పెద్ద కుట్రకు పాల్పడబోతున్నట్లు తమకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందిందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో కార్యకర్తలను పెద్ద ఎత్తున సమీకరించడం ద్వారా ప్రగతి భవన్ ను గాని, డీజీపీ ఆఫీసును గానీ, తెలంగాణ భవన్ ను గాని ముట్టడించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ముట్టడి అంటే మామూలు ముట్టడి కాదని, అవసరమైతే లాఠీచార్జీ, కాల్పుల వరకు తీసుకువెళ్లే ఎత్తుగడగా కేటీఆర్ ఆరోపించారు.
అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ముఖ్య నేత, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రాచుర్యంలో గల నాయకుడు ఓ ఉప ఎన్నికను ప్రామాణికంగా చేసుకుని, ప్రత్యర్థి పార్టీపై నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయడం, దాని ప్రతిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి పంపడం రాజకీయ కోణంలో పెను సంచలనం. రాష్ట్రంలో శాంతిభద్రతలకు బీజేపీ కుట్ర పన్నితే, ఆ కుట్ర ఏమిటో, అందుకు గల ఆధారాలేమిటో నేరుగా బహిర్గతం చేసేందుకు అవసరమైన యంత్రాంగం అధికార పార్టీ నేతలకు ఉంది. కానీ ‘విశ్వసనీయంగా’ తెలిసిందని పేర్కొనడమే ఇక్కడ చర్చకు దారి తీసింది.
ఏ ఉప ఎన్నికైనా తేలిగ్గా తీసుకుని విజయం సాధిస్తున్న అధికార పార్టీ నేతలు దుబ్బాక ఉప ఎన్నిక అంశంలో తొలిసారి అందుకు భిన్నంగా స్పందించడం గమనార్హం. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇండ్లల్లో తనిఖీలు, నోట్ల కట్టల లభ్యం ఘటన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓ ఐపీఎస్ అధికారిని దుబ్బాక ఉప ఎన్నికల ప్రత్యేక పరిశీలకునిగా నియమించడం ఈ సందర్భంగా గమనార్హం. సీనియర్ ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్ ను ప్రత్యేక పరిశీలకునిగా పంపడం, తాజా ఘటనల నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అమిత్ షా కు ఒక్క ఫోన్ కాల్ కాల్ చేస్తే ప్రజాస్వామ్యన్ని కాపాడేందుకు స్పెషల్ ఆఫీసర్ ను పంపారు. కేసీఆర్ నీ ఆటలు ఇక సాగవ్’ అంటూ ఎంపీ అర్వింద్ ఈరోజు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో అసలు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఏం జరుగుతోంది? అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా భిన్న కోణాల్లో చర్చ జరుగుతోంది. దుబ్బాకలో గెలుపు, ఓటములపై నిజంగానే ఏవేని ఆందోళనకర పరిణామాలు నెలకొన్నాయా? అదే నిజమైతే అది ఏ పార్టీ అభ్యర్థికి సంబంధించిన అంశం? అనేది కూడా తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. మొత్తానికి మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనున్న దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.