హైదరాబాద్ పోలీసులు పట్టుకున్న రూ. కోటి నగదు మొత్తపు హవాలా సొమ్ము ఘటనలో ఓ మీడియా సంస్థ అధిపతి పేరు ప్రస్తావనకు వచ్చింది. నగర నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, బేగంపేట పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రూ. కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పట్టుబడిన వారిలో సురభి శ్రీనివాసరావు అనే వ్యక్తి దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు బావ మరిదిగా పోలీసులు ప్రకటించారు. అదేవిధంగా రవికుమార్ అనే మరో వ్యక్తి సురభి శ్రీనివాసరావు డ్రైవర్ గా పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓట్లరు పంపిణీ చేసేందుకు నిందితులు తీసుకువెడుతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు వెల్లడించారు.
ఇదే సందర్భంగా మరో కీలక అంశాన్ని కూడా సీపీ ప్రకటించారు. పట్టుబడిన రూ. కోటి నగదును బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ నుంచి సురభి శ్రీనివాసరావు తీసుకువచ్చారని, దుబ్బాక ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఆయా మొత్తాన్ని తీసుకువెడుతున్నట్లు అతను తమ విచారణలో అంగీకరించినట్లు సీపీ అంజనీకుమార్ ప్రకటించారు. ఆయా మొత్తం నగదును పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి మేనేజర్ ఇచ్చినట్లు నిందితులు తెలిపారని సీపీ పేర్కొన్నారు. వివేక్ వెంకటస్వామి వీ6 ఛానల్, వెలుగు పత్రిక అధిపతి అనే విషయం తెలిసిందే. విశాఖ ఇండస్ట్రీస్ కూడా వివేక్ కుటుంబానికి చెందిన కంపెనీయే కావడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ అంజనీకుమార్ మీడియాకు వివరించారు.