దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కాన్పూర్ ఎన్కౌంటర్ ఘటనా స్థలం నుంచి సీఐ స్థాయి పోలీసు అధికారి పరారయ్యాడా? కిల్లర్ గ్యాంగ్ వికాస్ దూబే ముఠాకు ముందే ఉప్పందించాడనే అభియోగంపై చౌబేపూర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వినయ్ తివారీని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు సహా మొత్తం ఎనిమిది మంది పోలీసులను దారుణంగా కాల్చి చంపిన రౌడీ ముఠా లీడర్ వికాస్ దూబేకు స్థానిక పోలీసులే సాయం చేసినట్లు తాజా వార్తల సారాంశం. వికాస్ దూబే ముఠాతో ఎన్కౌంటర్ జరిగిన సందర్భంగా ముఠాలో కీలక సభ్యునిగా భావిస్తున్న దయాశంకర్ అగ్ని హోత్రి గాయపడి పోలీసులకు చిక్కాడు. దర్యాప్తులో భాగంగా అతన్ని విచారించిన పోలీసులకు విస్తుగొలిపే అంశాలు తెలిసినట్లు సమాచారం.
ఘటనకు ముందు వికాస్ దూబే మొబైల్ నుంచి కనీసం 20 మంది పోలీసుల అధికారులకు ఫోన్లు వెళ్లాయని తేలిందట. చౌబేపూర్ స్టేషన్ కు చెందిన కనీసం ఇద్దరు, ముగ్గురు పోలీసులతో వికాస్ దూబేకు రెగ్యులర్ సంబంధాలున్నట్లు కాల్ డేటా విశ్లేషణ ద్వారా పోలీసులు కనుగొన్నారు. వికాస్ దూబేను అరెస్ట్ చేసేందుకు డీఎస్పీ దేవేంద్ర మిశ్రా నాయకత్వంలోని పోలీసులు ఘటనా స్థలికి చేరుకోకముందే పోలీస్ స్టేషన్ నుంచి వికాస్ దూబేకు ఫోన్ కాల్ వెళ్లినట్లు విచారణలో తేలింది. దీంతో అప్రమత్తమై 20-30 మంది అనుచరులను పిలిచిన వికాస్ దూబే తన కోసం వచ్చిన పోలీసులపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు.
అయితే వికాస్ దూబే ముఠాతో ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఓ పోలీసు అధికారి పారిపోయాడని, ఘటన సందర్భంగా అతను రౌడీషీటర్లతో పోరాడినట్లయితే పరిస్థితి వేరే రకంగా ఉండేదని కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ వ్యాఖ్యానించినట్లు జాతీయ న్యూస్ ఛానల్ ఎన్డీటీవీ నివేదించింది. చౌబేపూర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వినయ్ తివారీని ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసి విచారిస్తుండడం గమనార్హం. ఇదే దశలో ఘటన అనంతరం నుంచి దొరకకుండా వికాస్ దూబే తప్పించుకుని తిరుగుతుండడం పోలీసులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.